Harish Rao: అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఎక్స్ వేదికగా మంగళవారం ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్లో పేదA ఇళ్లను కూల్చివేయడాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని మండిపడ్డారు. నాలుగు జిల్లాల నుండి వేల మంది పోలీసులను మోహరించి, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది, పేద ప్రజలు మీకేమైనా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే.. మీరు చేస్తున్న అరాచకం లోకానికి తెలియకూడదనే మీ భయం అర్థమవుతోంది.. చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారన్నారు. మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం అని నమ్మబలికిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారని మండిపడ్డారు. ఓటు వేసినందుకు మాకు తగిన శాస్త్రి జరిగిందని బాధితులు రోదిస్తుంటే.. గుండె తరుక్కు పోతున్నదన్నారు. ఎంతో కష్టపడి, రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషం అన్నారు.
బాధితుల ఆవేదన రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయం అన్నారు. ఈ అక్రమ కూల్చివేతలను ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెనక్కి వెళ్లాలి.. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టండి అని సూచించారు. పేదల గూడు చెదిరితే.. మీ అధికారం గద్దెలు అంతే వేగంగా కూలుతాయని హెచ్చరించారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదన్నారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఖమ్మం బిడ్డల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Also Read: S.S.Thaman: ఇద్దరికీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి.. రోషన్ శ్రీదేవి పై తమన్ కామెంట్స్!