Chamala Kiran Kumar Reddy: హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను అమ్మవారి దగ్గరకు తీసుకువచ్చి మతతత్వ రాజకీయాలు మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ ఉనికిని కాపాడుకునేందుకే బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్లో మతపరమైన భావోద్వేగాలను వాడుకున్నా బీజేపీకి ఆశించిన మెజారిటీ రాలేదని చామల గుర్తు చేశారు. హిందుత్వ రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా విఫలమైందని చామల వివరించారు. 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే బీజేపీకి దక్కింది కేవలం ఒక్కటేనని.. అలాగే 7 కార్పొరేషన్లకు గాను కేవలం కరీంనగర్లో మాత్రమే గెలిచిందని ఎద్దేవా చేశారు. గతాన్ని గుర్తు చేస్తూ గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడే స్థాయి లేదని ఘాటుగా విమర్శించారు. పిచ్చి మాటలు.. పిచ్చి యాక్టింగ్ మానుకోవాలని బండి సంజయ్కు ఎంపీ చామల హితవు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వెనుక ఉన్న అసలు కారణాలను బండి సంజయ్ తెలుసుకోవాలని చామల సూచించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడానికి వెళ్లడం లేదని.. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను బీజేపీ నాయకులను కలుస్తున్నారని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం.. మెట్రో ఫేజ్ 2.. రీజనల్ రింగ్ రోడ్ (RRR).. ఫ్యూచర్ సిటీ వంటి మెగా ప్రాజెక్టుల సాధన కోసమే ముఖ్యమంత్రి పదే పదే ప్రధాని మోడీని కలుస్తున్నారని వెల్లడించారు. ఈ కనీస జ్ఞానం లేకుండా విమర్శలు చేయడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు ఇచ్చింది రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తారని మాత్రమేనని చామల గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మత రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నేతలు ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.