Sasikala: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే VK శశికళ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రామనాథపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ఈ మేరకు స్పష్టతనిచ్చారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతిని పురస్కరించుకుని ఈ కీలక ప్రకటన చేయడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. జయలలిత ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా శశికళ స్పష్టం చేశారు.
తమ నూతన పార్టీ అన్నాదురై.. ఎంజీఆర్.. జయలలిత వంటి మహోన్నత నాయకులు చూపిన బాటలోనే పయనిస్తుందని ఆమె వెల్లడించారు. పేదలు.. అణగారిన వర్గాలు.. సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం తమ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని హామీ ఇచ్చారు. అన్నాడీఎంకేలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె సొంత కుంపటి పెట్టాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే భావిస్తున్నారు. జయలలిత వారసత్వాన్ని తానే కొనసాగిస్తానని ఆమె పరోక్షంగా ఈ సభ ద్వారా సంకేతాలు పంపారు.
శశికళ రాజకీయ ప్రవేశం తమిళనాడులోని ద్రవిడ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ను శశికళ పార్టీ ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ మద్దతును కూడగట్టుకునేందుకు ఆమె ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జయలలిత స్నేహితురాలిగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తెర వెనుక చక్రం తిప్పిన శశికళ.. ఇప్పుడు నేరుగా ప్రజాక్షేత్రంలోకి రావడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ పరిణామం అటు అధికార డీఎంకేతో పాటు ఇటు అన్నాడీఎంకేను కూడా ఆలోచనలో పడేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.