Farmers protest: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో శనివారం హైడ్రా, రెవెన్యూ అధికారుల భూసేకరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరించిన దాదాపు 650 ఎకరాల భూమి చుట్టూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు రావడంతో వివాదం రాజుకుంది. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను వదులుకునే ప్రసక్తే లేదంటూ స్థానిక రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి మొదలైన ఈ నిరసనలు సమయం గడుస్తున్న కొద్దీ తీవ్ర రూపం దాల్చాయి.
పోలీసులపై కారంపొడి దాడి..
అధికారులు ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించగా, ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు. నిరసన కారులను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసులపై కారప్పొడి చల్లి, కుర్చీలు విసిరేశారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో డీసీపీ యోగేశ్ గౌతమ్తో పాటు పలువురు సీఐల కళ్లలో కారం పడటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి చేతులు దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను, రైతులకు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
బాధితులకు బాసటగా నిలిచిన ప్రతిపక్షాలు
రైతుల పోరాటానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూర్తి మద్దతు ప్రకటించారు. పెద్ద ఎత్తున బహదూర్గూడ చేరుకున్న నేతలు.. అధికారుల ఏకపక్ష వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పంటలు పండిస్తున్న భూములను బలవంతంగా లాక్కోవడం అన్యాయమని మండిపడ్డారు. బాధితులకు ముందుగా ప్రత్యామ్నాయ భూమిని చూపించి, పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాతే ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రహించిన నిరసనకారులు అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను సైతం ధ్వంసం చేశారు.
చట్టప్రకారమే చర్యలు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు: డీసీపీ
ఈ ఘటనపై డీసీపీ యోగేశ్ గౌతమ్ తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై, పోలీసులపై కారప్పొడి చల్లడం, కుర్చీలతో దాడులకు తెగబడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. తాము కేవలం ప్రభుత్వ భూమికి రక్షణగా ఫెన్సింగ్ మాత్రమే వేస్తున్నామని, రైతులు సాగు చేసుకుంటున్న పంటలకు ఎలాంటి నష్టం కలిగించడం లేదని వివరించారు. సమస్యలు ఏవైనా ఉంటే శాంతియుత మార్గాల్లో, అధికారులతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప.. ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన నిరసనకారులను కోరారు.
ఆర్డీవోతో వాగ్వాదం.. అపరిష్కృతంగానే సమస్య
అంతకుముందు, సరిహద్దులు గుర్తించి కంచె వేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికులు చుట్టుముట్టారు. అక్కడికి చేరుకున్న ఆర్డీవో శ్రీధర్తో రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. తమ నోటికాడి కూడును లాక్కోవద్దని, న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఉదయం ఆర్డీవోతో జరిగిన చర్చలు విఫలం కావడంతో, మధ్యాహ్నానికి ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ప్రస్తుతం బహదూర్గూడ పరిసర ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. బాధితులకు సరైన పరిహారం, ప్రత్యామ్నాయం చూపించకుండా ముందుకెళ్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
Also Read: కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు
శంషాబాద్లో ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా బహుద్దుర్గూడలో బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ భూసేకరణ కోసం అధికారులు రాగా ఉద్రిక్తత నెలకొంది. సరైన పరిహారం, హామీలు ఇచ్చే వరకు భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆందోళనకు దిగడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.#Shamshabad #HYDRAA #BulletTrain… pic.twitter.com/fy1b4TPIng
— BIG TV Breaking News (@bigtvtelugu) July 18, 2026