Heavy Rains: తెలుగు రాష్ట్రాలపై వరుణ దేవుడు కన్నెర్ర జేస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా, రాగల 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ అల్పపీడన కదలికల వల్ల తీర ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ఈ జిల్లాలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాజధాని హైదరాబాద్ సహా మిగిలిన జిల్లాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో పిడుగుల హెచ్చరిక..
మరోవైపు ఏపీలోనూ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలి..
ఈ అల్పపీడన వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. రైతులు తమ పంట ఉత్పత్తులు తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పశువుల కాపరులు కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రెండు రోజుల పాటు వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, స్థానిక యంత్రాంగం కూడా అప్రమత్తమై సహాయక చర్యలకు సిద్ధంగా ఉంది.
Also Read: ఆమె లేని లోకంలో ఉండలేనంటూ.. ప్రియురాలు చనిపోయిన కొన్ని గంటల్లోనే ప్రియుడు సైతం..