Govt Hospital Scans: స్వేచ్చ బ్యూరో: పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూంటే, కొంత మంది ఆఫీసర్లు, స్టాఫ్ ధనదాహానికి ఆ లక్ష్యం నీరుగారిపోతున్నది. సర్కారీ ఆసుపత్రుల్లో ఉచితంగా అందాల్సిన వైద్య పరీక్షలు కాస్తా, కాసుల కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్గా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ‘స్కాన్’ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందనే సాక్షాత్తు ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు డాక్టర్లు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం దవాఖానకు వచ్చే రోగులకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ అయింది. సిటీ స్కాన్ కావాలంటే రూ. 500 సమర్పించుకోవాల్సిందే.అదే ఎంఆర్ఐ స్కాన్ అయితే ఏకంగా రూ. 2,500 ఇస్తేనే లోపలికి అనుమతి ఇస్తున్నట్లు పేషెంట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఇన్-పేషెంట్లకు ఉచితం అంటూనే, అవుట్-పేషెంట్ల నుంచి యథేచ్ఛగా వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల ‘బడ్జెట్ లేదు.. మెయింటెనెన్స్ ఖర్చులు’ అంటూ రోగుల నుంచే బలవంతంగా వసూలు చేస్తుండడం గమనార్హం.
పైసా ఇస్తేనే టెస్టులు చేస్తాం, లేదంటే ప్రైవేట్కు వెళ్లండంటూ సిబ్బంది తెగేసి చెబుతుండడంతో పేద రోగులు లబోదిబోమంటున్నారు.ఈ దందా ఏ స్థాయిలో వేళ్లూనుకుందో చెప్పడానికి తాజాగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో జరిగిన ఘటనే నిదర్శనం. అక్కడ టెక్నీషియన్లు, స్థానిక సిబ్బంది కుమ్మక్కై రోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్న ఉదంతం కలకలం రేపింది. ఇదేదో ఒక జిల్లాకో, ఒక ఆసుపత్రికో పరిమితమైన వ్యవహారం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజారిటీ జిల్లా ఆసుపత్రుల్లో ఇదే ‘సీక్రెట్ దందా’ నడుస్తోందని స్వయంగా ప్రభుత్వ వైద్యులే అంతర్గతంగా చర్చించుకోవడం గమనార్హం.
Also read: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేటీఆర్
కొన్ని ఆసుపత్రుల్లో ఉన్నతాధికారులకు తెలియకుండా టెక్నీషియన్లు సొంతంగా దందా నడిపిస్తుంటే.. మరికొన్ని దవాఖానల్లో మాత్రం పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. స్వయంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ల ‘ఇంటర్నల్’ ఆదేశాలతోనే ఈ వసూళ్లు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రి నిర్వహణ పేరుతో అక్రమంగా ఫండ్స్ వసూలు చేస్తూ, అందులో వాటాలు పంచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్కు పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం ఈ అక్రమార్కులకు వరంగా మారింది. పర్యవేక్షణ కరువై, జవాబుదారీతనం లోపించడంతో ఆయా ఆసుపత్రుల మేనేజ్మెంట్లది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అడిగే నాథుడు లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తన్నాయి.
మరి కొన్ని దవాఖాన్లలో మిషన్లు పనిచేయడం లేదంటూ ప్రైవేట్ కు పంపిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. తాత్కాలికంగా మిషన్లు వర్క్ చేయడం లేదని, స్పీడ్ గా టెస్టులు పూర్తి కావాలంటే ప్రైవేట్ కు వెళ్లాలంటూ కొందరు వార్డుల్లోని స్టాఫ్ సిఫారసులు చేయడం గమనార్హం. ప్రభుత్వాసుపత్రులలోని కొందరు స్టాఫ్కు కమీషన్లు ఇచ్చి మరీ ప్రైవేట్ ల్యాబ్స్ తమ వ్యాపారాన్ని చక్కదిద్దుకుంటున్నారనే విమర్శలు కూడా కొందరు డాక్టర్ల నుంచే వస్తున్నాయి. సర్కార్ వ్యవస్థను సెట్ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా..క్షేత్రస్థాయిలోని స్టాఫ్ నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నదని కొందరు డాక్టర్లు కోరతున్నారు.
Also read: థ్రిల్లింగ్ కోసం బీపీ ఇంజెక్షన్లతో.. మత్తును ఎక్కించుకుంటున్నయువత.. ఎలానో తెలుసా!