Food Safety Raids: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు.. విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా సరఫరా అయ్యే ఆహార పదార్థాల నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లతో పాటు అనేక స్థానిక యూనిట్ల గిడ్డంగులను కవర్ చేయడం విశేషంగా మారింది.
ఈ దాడుల్లో జెప్టో, రిలయన్స్ జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జోమాటో, స్విగ్గి, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్థానిక యూనిట్లను కవర్ చేసే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల గిడ్డంగులపై తనిఖీలు నిర్వహించారు.
మొత్తంగా 75 గిడ్డంగులను అధికారులు సందర్శించారు. ఈ తనిఖీల్లో 98 ఎన్ఫోర్స్మెంట్ నమూనాలు, 124 నిఘా నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల కోసం ల్యాబ్లకు పంపిన ఈ నమూనాల ఫలితాలు రానున్న రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ప్రాథమిక తనిఖీల్లోనే విస్తృత స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.
1,903 యూనిట్ల గడువు ముగిసిన ఆహార పదార్థాలు, తప్పుగా బ్రాండ్ చేయబడినవి, తప్పుగా లేబుల్లు ఉన్న ఆహార వస్తువులు భారీగా గుర్తించబడటం. వీటన్నింటిని అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, 76 కిలోల మేర గడువు ముగిసిన వస్తువులు, పాత నిల్వల ఆహారం, కుళ్ళిన కూరగాయలు కూడా పట్టుబడ్డాయి. ఇవి తినడానికి పూర్తిగా అనర్హమైనవని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు.
కొన్ని గిడ్డంగుల్లో ఫుడ్ స్టోరేజ్ నిబంధనలను పూర్తిగా పాటించకపోవడం, ఉష్ణోగ్రత నియంత్రణ లోపించడం, పరిశుభ్రత లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. ప్యాకింగ్ గదుల్లో చుట్టూ చెత్త పేరుకుపోవడం, పురుగులు సంచరించడం, ఫ్రిడ్జ్లలో కుళ్లిన కూరగాయలను గుర్తించారు.
ఈ తనిఖీల్లో 32 స్టోర్స్కు మెరుగుపరిచుకోవాలని నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువు లోపు లోపాలను సరిదిద్దకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయి. అవసరమైతే లైసెన్సులు రద్దు చేయడం, భారీ జరిమానాలు విధించడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ఈ దాడుల నేపథ్యంలో వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆన్లైన్లో ఆహార వస్తువులు ఆర్డర్ చేసే సమయంలో తయారీ తేదీ, గడువు తేదీ, లేబుల్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పదమైన ఆహార పదార్థాలు అందితే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.