Ravindra Naik: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ బిడ్డ కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరుడు మోసంచేస్తే పొలిమేర దాటేదాక తరమాలని, ప్రాంతంవాడు మోసంచేస్తే పాతరేయాలని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్.., కేసీఆర్ దుష్ట, దుర్మార్గ, అవినీతి పాలనను కొనసాగించారని మండిపడ్డారు. ఆయన పాలనలో తెలంగాణ ఆర్థికంగా చితికి రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు.
ఆ పరిస్థితి నుంచి గాడిన పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషిచేస్తున్నారని, లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తేవడం కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసాలను, అవినీతి పాలనను పసిగట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టారని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నాతో రాజకీయంగా పాతర వేశారన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే 65-70 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం సంతోషకరమని రవీంద్ర నాయక్ వెల్లడించారు. రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ, లక్షలాది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారన్నారు.
ఇది నచ్చని కేసీఆర్.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కుట్రలకు పాల్పడుతున్నారని, దీనిని తెలంగాణ ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తన పరిపాలనలో చేసిన అంతులేని అవినీతి, భూకుంభకోణాలు, ఫోన్ ట్యాపింగులు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ- భగీరథ, హరితహారంలో రూ.లక్షల కోట్ల అవినీతి, విద్యుత్ కుంభకోణం, కమీషన్లకు కక్కుర్తిపడి 11/12 శాతం అధిక వడ్డీలతో రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ అండ్ కోతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రవీంద్ర నాయక్ సూచించారు.
Also Read: రుతుపవనాలు ముందస్తు సూచన.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, నేడు-రేపు భారీ వర్షాలు