Telangana Rains Alert: దేశంలో రుతుపవనాల రాకకు ముందస్తు సూచనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బుధ-గురువారాల్ తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర-తూర్పు-దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
రుతుపవనాలు ముందస్తు సూచన
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ముందస్తు సంకేతాలు వచ్చేశాయి. గురువారం నాటికి కేరళ, తమిళనాడు తీరాలను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలియజేసింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అలాగే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, నేడు-రేపు భారీ వర్షాలు
పలు జిల్లాలకు ఆరెంజ్, కొన్ని జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఇదిలాఉండగా మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.
ఖమ్మం జిల్లా ఏన్కూరులో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట- 4 సె.మీ, దమ్మపేట-3, ములుగు జిల్లా వెంకటాపురంలో 1.7 సెం.మీ వర్షం కురిసింది. మొత్తానికి దేశవ్యాప్తంగా చల్లని కబురు వచ్చేసింది.
ALSO READ: మా సహనాన్ని పరీక్షించొద్దు.. ఎంతకైనా తెగిస్తాం.. పవన్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్!