Future City: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో సరికొత్తగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ కేవలం ఐటీ, పారిశ్రామిక హబ్గానే కాకుండా ఇకపై రాష్ట్ర కీలక పాలనా కేంద్రంగానూ రూపాంతరం చెందబోతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు చూస్తుంటే,రాబోయే రోజుల్లో కీలక శాఖల కార్యాలయాలన్నీ ఫ్యూచర్ సిటీ వైపే అడుగులు వేయనున్నట్లు స్పష్టమవుతోంది.
మెగా ప్లాన్పై కసరత్తు..
ఫ్యూచర్ సిటీలో కేవలం కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల ఆఫీసులనే కాకుండా,ప్రస్తుతం నగరంలో రద్దీ ప్రాంతాల్లో ఉన్న కొన్ని పాత శాఖల కీలక విభాగాలను కూడా అటు వైపు తరలించనున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీలో అధునాతన ప్రభుత్వ సముదాయాలను నిర్మించనున్నారు. అంతేగాక ప్రస్తుతం నగర నడిబొడ్డున ట్రాఫిక్, స్థల అభావం ఎదుర్కొంటున్న కొన్ని కీలక శాఖల హెడ్ ఆఫీసులను, విభాగాలను దశలవారీగా ఫ్యూచర్ సిటీకి షిఫ్ట్ చేయనున్నారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఈ మెగా ప్లాన్పై కసరత్తు ప్రారంభించింది. ఫ్యూచర్ సిటీకి ఏయే శాఖలను తరలించవచ్చు? అక్కడ ఏయే కార్యాలయాలకు ఎంత స్థలం అవసరమవుతుంది? అనే అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వ యోచన ఇదే..
గతంలో సైబరాబాద్ కే పరిమితమైన సిటీ, ఇప్పుడు ఫోర్త్ సిటీ వైపు నకు మళ్లుతుంది. ప్రభుత్వ లక్ష్యం, సిటీ గ్రోత్ దృష్ట్యా పబ్లిక్ కూడా ఫోర్త్ సిటీ బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే భూమి ధరలు కూడా అక్కడ విపరీతంగా పెరిగాయి. గతంలో పోల్చితే ఏకంగా 50 శాతం అదనంగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలను కూడా ప్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తున్నది. అంతేగాక నగరంపై పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలంటే ప్రభుత్వ పాలనా విభాగాలు కూడా అక్కడ క్రియాశీలకంగా ఉండాలి. అందుకే ఈ భారీ షిఫ్టింగ్కు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
సీఎం ఆదేశాలతో స్పీడప్..
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మెట్రో కనెక్టివిటీ, అంతర్జాతీయ స్థాయి రోడ్ల నెట్వర్క్తో పాటు, ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు నిర్ణయంతో ఈ ప్రాంతానికి రియల్ ఎస్టేట్ పరంగానే కాకుండా, వ్యూహాత్మకంగానూ భారీ డిమాండ్ పెరగనుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుండటంతో, అధికారులు ఫాస్ట్ ట్రాక్ మోడ్లో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ పాలనలో ‘ఫ్యూచర్ సిటీ’ ఒక కీలకమైన ‘పవర్ సెంటర్’గా మార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల కార్పొరేట్ కంపెనీలు కూడా ప్యూచర్ సిటీకి వస్తున్నాయి. ప్రజాప్రభుత్వం హయంలో ఫోర్త్ సిటీ నిర్మితమైందనే గుర్తింపు ఉండాలని సీఎం సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్నారు.
Also Read: సీఎం ఫ్యూచర్ కే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ కడతావా? ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు