Dharmapuri Arvind: స్వేచ్ఛ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడు పార్టీలు మారారని, ఇక రేవంత్ వస్తే బీజేపీలోకి వస్తాడేమోనని, మహా అంటే కొడంగల్ లో ఎమ్మెల్యేగా గెలుస్తాడేమోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవాచేశారు. రేవంత్ చేరుతానంటే కాంగ్రెస్ వాళ్లు.. బీజేపీ లో జాయిన్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్ పై ఎంపీ ధర్మపురి ఫైర్
సీఎం రేవంత్.. ఏబీవీపీలో ఉన్నానని ప్రచారం చేసుకున్నారని, ఆయన ఏబీవీపీలో చేసిందేమీ లేదని అర్వింద్ చురకలంటించారు. ఆయన సోదరుడు ఏబీవీపీలో ఉండావాడని, రేవంత్ కు ఏబీవీపీ స్పెల్లింగ్ కూడా రాదని ధ్వజమెత్తారు. తాను ఏబీవీపీ అని రేవంత్ పదే పదే చెప్పడం వల్ల ప్రధాని మోడీ రేవంత్ ను రమ్మని అన్నారేమోనని వ్యాఖ్యానించారు. రేవంత్ కు పాలన చేతకాకుంటే రాజీనామా చేయాలి తప్పితే రైతులను గోస పెట్టొద్దని సూచించారు. వడ్ల కొనుగోలుపై తెలంగాణకు కేంద్రం ఎలాంటి మార్జిన్ విధించలేదని స్పష్టంచేశారు.
రైతలపై రాజకీయం
రైతులపై రాజకీయం చేయడానికి రేవంత్ కు సిగ్గుండాలని మండిపడ్డారు. పంటల ప్రొక్యూర్మెంట్ కు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని, సమయానికి కొనుగోలు కేంద్రాలు పెట్టక.. అకాల వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారుతున్నాయన్నారు. ఇసుక సప్లయ్ కి లేని లారీల కొరత వరికి ఎందుకు వస్తోందని అర్వింద్ ప్రశ్నించారు. 2024-2025, 2025-2026 కు సంబంధించిన ధాన్యం కొనుగోలులో కేంద్రానికి ఇంకా 36 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ ఇవ్వడం బాకీ ఉందని స్పష్టంచేశారు. అలాంటిది రేవంత్.. బీజేపీ నేతల ఇండ్ల ఎదుట ధాన్యం పారబోస్తానని చెప్పడం రాష్ట్రానికి అరిష్టమని అర్వింద్ విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ కు సొంత ఎజెండా
తెలంగాణలో ఒక్క మార్కెట్ యార్డ్ అయినా బాగు చేశారా? అని ప్రశ్నించారు. సీఎం ఫ్యూచర్ కే దిక్కులేదని, అలాంటిది ఫ్యూచర్ సిటీ కడతావా? అని ప్రవ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సొంత ఎజెండా ఉంటుందని అర్వింత్ తెలిపారు. తెలంగాణ ఎవరి జాగీర్ కాదని, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి జాగీర్ కాదన్నారు. ఇది ప్రజల జాగీర్ అని పేర్కొన్నారు. రేవంత్ యూఎస్ లో ఒక కోర్సు చేసేందుకు రూ.లక్షల్లో ఫీజు చెల్లించారని, అక్కడికి వెళ్లి వచ్చినందుకు, ఆయనతో పాటు సెక్యూరిటీ, కాంగ్రెస్ నేతలు వెళ్లడంతో బిల్లు తడిచి మోపెడయిందని విమర్శించారు.
ఎంపీ అర్వింద్ సూటి ప్రశ్న
అలా కాకుండా రేవంత్.. ప్రధాని మోడీ వద్దకు వెళ్లి ఒక గంట కూర్చుంటే గవర్నెన్స్ గురించి నేర్పించేవారన్నారు. రేవంత్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కనాడైనా తెలంగాణకు అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చారా? అని అర్వింద్ ప్రశ్నించారు. సోనియా గాంధీని తిట్టిన ఇలాంటి వ్యక్తిని సీఎం చేయడానికి కాంగ్రెస్ కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ప్లానింగ్ ఏంటని, దాన్ని విడుదల చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు. రేవంత్ కు రియల్ ఎస్టేట్, ఎక్స్ టార్షన్ తప్పా ఏమీ తెలియదని అర్వింద్ ధ్వజమెత్తారు.
Also Read: ఢిల్లీలో హైడ్రామా.. ఎయిర్పోర్టులోనే ‘సీజేపీ’ అధినేత అరెస్ట్? రంగంలోకి పారామిలటరీ!