Hyderabad News: హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త చెప్పింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు విలీనమైన మున్సిపాలిటీల ఆస్తి పన్ను బకాయిదారులకు వన్ టైమ్ స్కీమ్-OTS స్కీమ్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది. మంగళవారం నుంచే అమలుకానుంది.
గ్రేటర్వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త
హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్వాసులతోపాటు ఇటీవల విలీనమైన మున్సిపాలిటీల ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆస్తిపన్ను బకాయిలతో ఇబ్బందిపడుతున్న వారికి ఊరటనిచ్చింది. వన్ టైమ్ స్కీమ్-OTS స్కీమ్ని పునరుద్ధరించింది.
ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం వరకు మాఫీ చేయనుంది. దీనికి సంబంధించిన తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్వర్తులు జారీ చేశారు. మంగళవారం నుంచి ఓటీఎస్ స్కీమ్ అమల్లోకి వచ్చింది.
ఆస్తి పన్నులో 90 శాతం వరకు రాయితీ
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు ఈ రాయితీ వర్తించనుంది. పేరుకుపోయిన వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే చాలు. మిగతా 90 శాతం వడ్డీని పూర్తిగా రద్దు చేయనుంది. బల్దియాతోపాటు విలీనమైన 27 లోకల్ బాడీలకు ఈ పథకం వర్తించనుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను ద్వారా రూ.3 వేల కోట్లను టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును తొలుత రూ.2,200 కోట్లుగా ఫిక్స్ చేసింది. ఆ తర్వాత పెంచుకుంటూ వచ్చింది. ఇటీవల 27 మున్సిపాలిటీలు గ్రేటర్ లో విలీనం కావడంతో పరిధి అమాంతంగా పెరిగింది. పాత లెక్కల ప్రకారం.. జీహెచ్ఎంసీలో దాదాపు 14 లక్షల ప్రాపర్టీలున్నాయి.
విలీనమైన వాటితో కలిపి సుమారు 18 లక్షల నుంచి 19 లక్షల వరకు పెరిగిందని ఓ అంచనా. 27 మున్సిపాలిటీల్లో ఆస్తుల క్యాపిటల్ వ్యాల్యూ ప్రాతిపదికన వసూలు చేసేవారు. బల్దియా పరిధిలో రెంటల్ వ్యాల్యూ ప్రాతిపదికన ఆస్తి పన్ను వసూలు చేసేవారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు రూ.1,478 కోట్ల వసూలు అయ్యాయి.
ALSO READ: పదేళ్లు పాలన మర్చిపోయారా? కేసీఆర్ కు మతిమరుపు వచ్చిందన్న డీకే అరుణ
అంచనాలు అందుకునేందుకు మరో రూ.1,500 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. గ్రేటర్ లో మూడు సార్లు ఓటీఎస్ స్కీమ్ అమలు చేసింది జీహెచ్ఎంసీ. తొలిసారి 2020లో దీన్ని ప్రవేశపెట్టింది. కరోనా సమయంలో ఆదాయం తగ్గడంతో ఓటీఎస్ పద్దతి తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. 2022–23 లో రెండోసారి అమలు చేసింది.
2024–25 ఆర్థిక ఏడాదికి మూడోసారి అమలు చేస్తోంది. గ్రేటర్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచే ఐదువేల కోట్లు రావలసి ఉంది. ప్రజల నుంచి మరో 6 వేల కోట్లు రూపాయలు రావాలి. విలీనమైన లోకల్ బాడీల్లో వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారుల మాట. అన్ని చోట్లా బకాయిలు పెరగడంతో ఓటీఎస్ పథకానికి శ్రీకారం చుట్టింది.