GHMC News: తెలంగాణలో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ, పట్టణాలు, నగరాల్లో ఆదాయాన్ని పెంచడానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తొలుత జీహెచ్ఎంసీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇంతకీ కామన్ బిల్లు పే విధానం అంటే ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పన్ను వసూళ్లకు జీహెచ్ఎంసీ కొత్త ప్లాన్
తెలంగాణలో నగరాలు, పట్టణాల్లో ఆదాయం పెంచేందుకు కసరత్తు చేసింది ప్రభుత్వం. ముంబై, బెంగళూరు సిటీల మాదిరిగా బిల్లులు కట్టే పద్దతి తీసుకురావాలని నిర్ణయించుకుంది. అందులో కరెంట్, వాటర్, ప్రాపర్టీ ట్యాక్స్లకు సంబంధించి కామన్ బిల్ యాప్ని తీసుకురానుంది. దీనికి సంబంధించి తెరవెనుక చర్యలు ప్రారంభించింది. ప్రత్యేకంగా మొబైల్ యాప్ని రెడీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత ఆయనతో ప్రారంభించనుంది.
పైలెట్ ప్రాజెక్టుగా తొలుత జీహెచ్ఎంసీని ఎంపిక చేసింది. ఇక్కడ 19 లక్షలకు పైగానే ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లు ఉన్నాయి. ట్యాక్స్ పరిధిలోని రాని భవనాలు లక్షల్లో ఉన్నట్టు అధికారుల మాట. జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ కేటగిరిలో భవన యజమానులు వాటర్, కరెంట్ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్సులు కట్టకుండా చాలామంది పెండింగ్లో పెట్టారు. దీన్ని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు.
ఆ మూడింటికి ‘కామన్ బిల్లు పే విధానం’
దాదాపు 93 వేల మంది ఆస్తి పన్ను చెల్లిస్తున్నప్పటికీ వాటికి వాణిజ్య విద్యుత్ మీటర్లను ఉపయోగిస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి దీనిపై ఫోకస్ చేశారు అధికారులు. GHMC బిల్ కలెక్టర్లు, విద్యుత్ మీటర్ రీడర్లు సోమవారం నుండి సంయుక్తంగా సర్వే చేపట్టారు. విద్యుత్ వినియోగదారుల మొబైల్ నెంబర్లను ఆస్తి పన్నుతో లింక్ చేయనున్నారు.
ఫిబ్రవరి 15 వరకు గడువు నిర్ణయించింది. ఈ ప్రక్రియను సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కన్జ్యూమర్ సర్వీస్ నెంబర్ల ద్వారా యజమానుల ఫోన్ నెంబర్లను స్వీకరిస్తున్నారు. ఈ సెల్ నెంబర్లను అప్ డేట్ చేసుకునే ఛాన్స్ ఆ సేవల్లో కల్పించనున్నారు. చాలా ప్రాంతాలకు తాగు నీటి సదుపాయం లేదు.
ALSO READ: పురపోరు ఖర్చు ఇన్ఛార్జీలదే.. తేల్చిచెప్పిన బీఆర్ఎస్ పార్టీ
అంతేకాదు పారిశుధ్యం సమస్య, దోమల నియంత్రణ, వీధి కుక్కల నిర్వహణ వంటివి చాలా ప్రాంతాలు ఎత్తి చూపుతున్నాయి. పన్ను వసూలు అమలు చేయడానికి ముందు సేవలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ తీసుకొచ్చిన యాప్లో వినియోగదారులు విద్యుత్, వాటర్ బిల్లు చెల్లించేటప్పుడు ఆన్ లైన్లో ప్రాపర్టీ ట్యాక్స్ విషయం డిస్ ప్లే అవుతుందని చెబుతున్నారు. దీనివల్ల వినియోగదారులకు పదేపదే గుర్తు చేస్తుందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ సక్సెస్ అయితే తొలుత మిగతా నగరాలు, ఆ తర్వాత పట్టణాలు, చివరకు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తోంది.