BRS: మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారఖర్చును ఆనియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీకే అప్పగించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నుంచి ఖర్చు ఇస్తారని భావించినట్లు ఇన్ చార్జీనే పెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఖర్చుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు చెప్పిన అభ్యర్థులకే టికెట్లు ఇచ్చారు. గెలుపుబాధ్యతను సైతం వారికే అప్పగించడంతో వారు ఇప్పుడు ఖర్చుపెడితే తమకు కలిసివస్తుందా? లేదా? అనే అంశాలపై బేరీజు వేసుకుంటున్నారు. గెలిపించుకోకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల టికెట్ కష్టంగా మారే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ చార్జీ బాధ్యతలను సైతం పార్టీ ఎమ్మెల్యేలకు అప్పగించింది. సిట్టింగ్ లేని దగ్గర మాజీ ఎమ్మెల్యేలకు ఇన్ చార్జీ ఇచ్చారు. దీంతో వారే ఆ నియోజకవర్గంలో కీలకంగా మారారు. అయితే పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రధానప్రతిపక్షానికే పరిమితం అయింది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలకు గులాబీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఏ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నా ఆ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యేకే ఎన్నికల ఖర్చు బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. వీరే ఆ నియోజకవర్గానికి ప్రస్తుతం కూడా ఇన్ చార్జీగానే వ్యవహరిస్తున్నారు, దీంతో వారికే ఎన్నికల ఖర్చు బాధ్యతను, గెలుపు బాధ్యతలను అప్పగించింది. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఎన్నికల ఖర్చుపై సమాలోచనలో పడినట్లు సమాచారం. కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొంటుండటంతో పోటీచేసే అభ్యర్థులు సైతం కొంత నిరాశకు గురవుతున్నారు.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో రెండు లేదా మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్కో మున్సిపాలిటీలో పదేహేను నుంచి 40కి పైగా డివిజన్లు లేదా వార్డులు ఉన్నాయి. అయితే ఒక్కో డివిజన్ కు సుమారు 5నుంచి 10 లక్షలకు పైగా ఎన్నికల్లో ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్యే ప్రధాన ఫోటీ నెలకొనడంతో అధికారపార్టీని ఢీ కొనాలంటే ఖర్చును సైతం భారీగా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీ అభ్యర్థులు కొంత స్వతహాగా ఖర్చుచేసేందుకు సుఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జులు మాత్రం కొంత విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. డబ్బులు ఖర్చు పెట్టినా విజయం సాధించలేకపోతే తమపరిస్థితి ఏంటి? ఎన్నికల్లో చేసిన ఖర్చు మళ్లీ ఎలా రికవరీ అవుతుందని అంచనాలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ అధిష్టానం ససేమిరా అనడంతో ఏం చేయాలనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఖర్చుచేయకపోతే అసలు గెలిచే అవకాశం ఉండదు. కనీసం పోటీసైతం ఇచ్చే అవకాశం ఉండబోదని సమాచారం.
అసెంబ్లీ ఇన్ చార్జులకు మున్సిపల్ ఎన్నికలు సవాల్ గా మారాయి. వారి పనితీరుకు గీటురాయిగా మారనున్నాయి. నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తున్నా.. డబ్బులు మాత్రం తీయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్నా.. ఇప్పటివరకు ఇన్ చార్జులు కనీసం దగ్గరకు తీయడం లేదని, కేవలం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఎలా గెలిచేదాని అభ్యర్థులు సహచరులతో గోడును వెళ్లబోసుకుంటున్నారు. గెలిస్తే మాత్రం పార్టీ అధిష్టానం దగ్గర ఇన్ చార్జులకు మార్కులు వస్తాయి. లేకుంటే మాత్రం వారి తీరుతో మళ్లీ అసెంబ్లీ నాటికి మరోనేతను తెరమీదకు తీసుకొస్తారనే ప్రచారం సైతం జరుగుతుంది. ఇంతకు సెగ్మెంట్ ఇన్ చార్జులు గెలుపుకోసం ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది చూడాలి.
గులాబీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ, ఆర్థిక వ్యవహారాలు మొత్తం నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ చార్జులే చేసుకున్నారు. బాగానే వెనకేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించాల్సిన నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జులు ఆదిశగా ముందుకు సాగడం లేదని, కేవలం మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ అధిష్టానం మున్సిపాలిటీల వారీగా సేకరిస్తున్న రిపోర్టుల్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై మైనస్ గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పైస తీయకుండా విజయం సాధించాలంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరో8 రోజులు మాత్రమే పోలింగ్ కు గడువు ఉండటంతో ఎలా ముందుకు వెళ్తారు..పార్టీని విజయతీరాలకు ఎలా తీసుకెళ్తారనే ప్రచారం ఊపందుకుంది.