GHMC Merger: హైదరాబాద్ మహానగర పరిధి విస్తరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో 27 మున్సిపాలిటీలను విలీనం చేసే ప్రతిష్ఠాత్మక ప్రక్రియకు గవర్నర్ ఆమోదం లభించింది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్కు సంబంధించిన ఫైల్ గవర్నర్ ఆమోదంతో తిరిగి ప్రభుత్వానికి చేరుకుంది. దీంతో ప్రభుత్వ సర్కిల్లో చర్చనీయాంశంగా మారిన ఈ విలీన ప్రక్రియకు అధికారిక ముద్ర పడినట్లయింది. త్వరలోనే ఈ ఆర్డినెన్స్కు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ 27 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధి గణనీయంగా విస్తరించనుంది. నగరానికి ఆనుకుని ఉన్న కీలక పట్టణాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ ఏరియాలు, పరిశ్రమల ప్రాంతాలు ఇకపై GHMC పరిధిలోకి రానున్నాయి. దీని వల్ల పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత నిధులు సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అదే సమయంలో పన్నుల వసూళ్లు, ఆస్తి నమోదులు, భవనాల అనుమతులు వంటి అంశాలలో కూడా స్పష్టత, పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి
పెద్ద అంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట, బండ్లగూడ జాగీర్, మీర్పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట మున్సిపాలిటీలు ఇకపై జీహెచ్ఎంసీలో విలీనం కానున్నట్లు తెలుస్తోంది.