Sarpanch Nominations: తెలంగాణలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు హుషారుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే నామినేషన్ నుంచి ప్రజల్ని ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలో ఓ అభ్యర్థి వెయ్యి రూపాయి నాణేలతో నామినేషన్ దాఖలు చేస్తే తాజాగా మరో అభ్యర్థి గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
పంచాయతీ ఎన్నికలను గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రెండో విడతగా సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది. మండలాన్ని ఆరు క్లస్టర్లుగా విభజించి నామినేషన్లు స్వీకరించారు. జోగిపేట అక్సాన్పల్లి క్లస్టర్లో తాడ్మన్నూర్ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ మద్దతుదారుడు పట్లోళ్ల వీరారెడ్డి(నాని) గుర్రంపై వచ్చి అట్టహాసంగా నామినేషన్ను దాఖలు చేశారు.
పటోళ్ల వీరారెడ్డి రెండు గుర్రాలు తెప్పించి ఒక గుర్రంపై తాను కూర్చొని తాడ్మన్నూర్ నుంచి అక్సాన్పల్లి వరకు వందల సంఖ్యలో మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించారు. అభిమానులు గజమాలతో పటోళ్లకు స్వాగతం పలికి, వాహనంపై ఊరేగించారు. వందల సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, యువకులు తరలిరావడంతో సాధారణ ఎన్నికలను తలపించేలా ర్యాలీ నిర్వహించారు.
Also Read:
అలాగే అల్మాయిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మద్దతుదారుడు మాజీ సర్పంచ్ రవిశంకర్ వందల సంఖ్యలో తన మద్దతుదారులతో వచ్చి, జోగిపేట ఎంపీపీ కార్యాలయంలో నామినేషన్లను దాఖలు చేశారు. అందోలు మండలంలో 25 పంచాయతీ స్థానాలకు గాను 19 మంది సర్పంచ్ స్థానానికి, 45 మంది వార్డు మెంబర్ల స్థానానికి నామినేషన్లు దాఖలు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు.