HYDRA Warns: ఓపెన్ ప్లాట్లు, ఇంటి స్థలాలు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసే ముందే లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నగరవాసులకు హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఏమైనా ఉన్నాయా? అనుమతి పొందిన లే ఔటా? కాదా? పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది. గేటెడ్ కమ్యూనిటీ అంటూ ప్లాట్లు, విల్లాలు అమ్ముతున్నప్పుడు ఆ అనుమతులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని హితవు పలికింది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఫిర్యాదుదారులకు ఈ జాగ్రత్తలను సూచించింది.
సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు రాగా వాటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. లే ఔట్ను పరిశీలించి న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇవ్వడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: BSNL Recharge Plan: రోజుకు రూ.6తో.. 164 రోజుల పాటు.. 300GB డేటా, అపరిమిత కాల్స్!
హైడ్రాకు అందిన ఫిర్యాదుల విషయానికి వస్తే.. బాచుపల్లి చెరువులో మురుగునీరు వచ్చి చేరుతోందని దీని వల్ల దోమలు విపరీతంగా వచ్చి చేరుతున్నాయని హరిహర హాల్ మార్కు కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. అటు సంగారెడ్డి అమీన్పూర్ చెరువులో తమ లే ఔట్ మునిగిపోయిందని, చెరువులో నుంచి నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వరుసగా చాలా లే ఔట్లు నీటిలో మునిగిపోయాయని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హౌజింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు. చెరువు ఎప్టీఎల్ ను నిర్ధారించి తమ లే ఔట్లు మునగకుండా చూడాలని, తప్పనిసరి పరిస్థితి ఉంటే వెంటనే తగిన విధంగా నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా పలు రకాల ఫిర్యాదులు హైడ్రాకు అందాయి.
Also Read: LPG Saving Kitchen Tips: గ్యాస్ త్వరగా అయిపోతుందా? చాలా మంది కిచెన్లో చేసే 10 పొరపాట్లు ఇవే!