రైతులకు యూరియాను ఒకేసారి కాకుండా.. పలు విడతల వారిగా సరఫరా చేయనున్నారు. ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో, ఐదు నుంచి ఇరవై ఎకరాలు ఉన్న రైతన్నలకు మూడువిడతల్లో, 20 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియాను బుక్ చేసుకుని యూరియాను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత యాప్లో రైతు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ను నమోదు చేయగానే.. లింకైన ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే రైతుకు చెందిన భూమి విస్తీర్ణం, సాగు చేసిన పంటకు అవసరమైనటువంటి యూరియా పరిమాణంలో బుకింగ్ ఆధారంగా.. అధీకృత టైలర్లు లేదా సహకార సంఘాల ద్వారా యూరియాను కొనుగోలు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. బుకింగ్ చేసుకున్న యూరియా కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ గడువు తేదీలోగా యూరియా తీసుకోనట్లైతే అది తిరిగి స్టాక్లోకి వెళ్తుంది.
ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీ వల్ల రైతులకు సమయం ఆదాతో పాటు .. యురియా ఇతర ఎరువుల పంపిణీనీ సరళతరం చేసేందుకు విధానం తీసుకొచ్చినట్లుగా కొద్దిరోజుల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. దీని ద్వారా ఎరువులు పక్కదారి పట్టకుండా పంట పండించే అన్నదాతలకు మాత్రమే అందుతాయని చెప్పారు. ఈ యాప్ వినియోగంపై అన్నదాతలకు సమస్యలు ఉంటే.. సంబంధిత ఏఈవోను సంప్రదింపవచ్చని వివరించారు. అధికారులందరూ యాప్ గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు.