Eagle Team: తెలంగాణ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు చేశారు. గత నెల రోజుల నుండి అత్యంత గోప్యంగా కొనసాగుతున్న నిఘా, సమగ్ర ప్రణాళికతో, సుమారు 100 మంది సభ్యులున్న తెలంగాణ ఈగల్ టీమ్ (Eagle Team) ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ కీలకమైన ఆపరేషన్ను ఈగల్ టీమ్ చీఫ్ సందీప్ శాండిల్య స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో ఉమ్మడిగా నిర్వహించిన ఈ దాడులు ఎంతో వ్యూహాత్మకంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ నెట్వర్క్ను ఛేదించడంలో ఈగల్ టీమ్ చూపిన తెగువ, కచ్చితత్వం అద్భుతమని ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.
ఈ భారీ ఆపరేషన్లో భాగంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి ఏకంగా 50 మంది నైజీరియన్ జాతీయులను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. వీరి నుండి కిలోగ్రాముకు పైగా బరువున్న నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ ముఠా… హైదరాబాద్ సహా భారతదేశంలోని పలు ప్రధాన నగరాలకు, రాష్ట్రాలకు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ నైజీరియన్ల అరెస్ట్తో… దేశంలో డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన ఒక పెద్ద డ్రగ్స్ వ్యవస్థ విచ్ఛిన్నమైనట్లు అధికారులు భావిస్తున్నారు. పట్టుబడిన డ్రగ్స్కు అంతర్జాతీయ మార్కెట్లో అధిక విలువ ఉంటుందని అంచనా. ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మంది నైజీరియన్లను ప్రస్తుతం ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచి, మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.
మరోవైపు.. ఢిల్లీలో పట్టుబడిన ఈ ముఠాకు లింకులు ఉన్నట్లు గుర్తించిన మరో ఇద్దరు నైజీరియన్ మహిళలను కూడా ఈగల్ టీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో అరెస్ట్ చేసింది. డ్రగ్స్ సరఫరా, నెట్వర్క్ నిర్వహణలో ఈ మహిళలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, విశాఖ నగరాల్లో జరిగిన ఈ అరెస్ట్లు… ఈ డ్రగ్స్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తున్నాయి.
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో.. అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్లోని మూలాలను, వారికి భారతీయ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించేందుకు ఈగల్ టీమ్, ఇతర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ALSO READ: GCC: హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. వెయ్యికి పైగా ఉద్యోగాలు!