E-Paper
Advertisement

Greater Hyderabad Voting : హైదరాబాదీలు బ్యాడ్ రిమార్క్ ను పోగొట్టుకుంటారా? ఈసారైనా ఓట్లు వేస్తారా?

Greater Hyderabad Voting : హైదరాబాదీలు బ్యాడ్ రిమార్క్ ను పోగొట్టుకుంటారా? ఈసారైనా ఓట్లు వేస్తారా?

Greater Hyderabad Voting : ఎలక్షన్స్‌ అనగానే ప్రతీఒక్కరూ సలహాలు ఇస్తుంటారు. తప్పులు వెతుకుతుంటారు. అరె రాంగ్‌ పర్సన్‌ని ఎన్నుకున్నారని నిట్టూరుస్తుంటారు. అదే నేనైతే ఇలా చేసే వాడిని.. అలా చేసే వాడిని అని గొప్పలు పోతుంటారు. ఈ ధోరణి విద్యావంతులు, నగరంలో ఉండే ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సమాజం పట్ల బాధ్యతలను గుర్తు చేస్తూ ఊగిపోతుంటారు. మరి ఇంత లెక్చర్లు ఇచ్చే ఈ ఇంటలెక్షువల్స్‌ పోలింగ్‌ అనగానే దిండును తన్నేసి బజ్జుంటారు. ఓటు వేయాలంటే పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలి.. క్యూలో నిల్చోవాలి.. అబ్బా ఇదంతా మనకెందుకు అని బద్ధకిస్తుంటారు. హాలిడే కదా ఓ బిర్యానీ ఆర్డర్‌ పెట్టి తినేస్తే పనైపోతుందని భావిస్తారు. అలాంటి వారి కోసమే సామాజిక సేవలో భాగంగా ర్యాపిడో కూడా ఫ్రీరైడ్‌ ఆఫర్‌ ప్రకటించింది. మరి ఈ అవకాశాన్ని వాడుకునైనా ఎంతమంది ఓటేస్తారు? పోలింగ్‌ అనగానే హైదరాబాదీల మీద ఉన్న బ్యాడ్‌ రిమార్క్‌ను ఈసారైనా పోగొట్టుకుంటారా? అనేది తేలాల్సి ఉంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి మందికి పైగా జనం నివసిస్తున్నారు. వీళ్లలో గ్రేటర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు కోటి 9 లక్షల మందికిపైగానే ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి 7 లక్షల 32వేలకు పైగా ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కుత్బుల్లాపూర్‌ 6 లక్షల 99 వేలకు పైగా ఓటర్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. మేడ్చల్‌లో 6 లక్షల 40 వేలు, ఎల్బీనగర్‌లో దాదాపు 6 లక్షలు. రాజేంద్రనగర్‌ 5 లక్షల 80 వేల మందికిపైగా ఓటర్లతో టాప్‌ ఫైవ్‌ ప్లేస్‌లో నిలిచాయి. అత్యల్పంగా చార్మినార్‌లో 2 లక్షల 26 వేల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. థర్డ్‌జెండర్‌ ఓటర్లు 12 వందల మందికిపైగా ఉన్నారు.

ఇంతమంది ఓటర్లు ఉన్నా వాళ్లందర్నీ పోలింగ్‌ కేంద్రాలకు రప్పించడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. మహానగరంలో ప్రతిసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. 50 శాతానికి మించి దాటడం లేదు. గ్రేటర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతానికే పరిమితమైంది. 2020 గ్రేటర్ హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో 46 శాతం ఓటర్లే కేంద్రాలకు వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 60 నుంచి 70 శాతం వరకు పోలింగ్‌ నమోదవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం గణనీయంగా పతనమవుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓటింగ్‌ శాతం పెంచేలా అధికారులు పక్కా ప్రణాళికలతో పనిచేశారు. విస్తృతంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు రూపొందించారు. ఓటుహక్కు ఇంపార్టెన్స్‌ తెలియజేస్తూ ప్రచారం చేశారు.

హైదరాబాద్‌ ఓటర్లు నిర్లిప్తతతోనే పోలింగ్‌ కేంద్రాలకు రావడం లేదనే విమర్శలున్నాయి. హైదరాబాద్‌ కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు చైతన్యం చూపిస్తున్నారు. విద్యా వంతులు, ఉద్యోగులు ఉన్నప్పటికీ పోలింగ్ శాతం మాత్రం డీలా పడుతోంది. ఒకే వ్యక్తి కొత్త ఓటు కోసం ఎక్కువ దరఖాస్తులు పెట్టడం, హైదరాబాద్‌కు వలస వచ్చినవారు.. నగరంతో పాటు స్వస్థలాల్లో ఓటింగ్ ఉండటం పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణాలుగా అధికారులు గుర్తించారు. చాలా ఏళ్లుగా తప్పులతడకగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేసేందుకు ప్రయత్నించారు.

దాదాపు మూడు లక్షల డూప్లికేట్ ఓట్లను తొలగించారు. ఒకే ఇంట్లో ఉన్నవాళ్లు ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేలా మూడున్నర లక్షల ఓట్లు సర్దుబాటు చేశారు. హైదరాబాద్‌లో ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు చాలా మంది ఇళ్లు మారుతుంటారు. గత జూన్, జులైలో ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రెండుచోట్ల ఉన్న ఓట్లను తొలగించారు. బూత్ స్థాయి అధికారులు ఓటింగ్‌ స్లిప్ అందించి ఓటరు సంతకం తీసుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారుల చేపట్టిన చర్యలు ఈసారి గ్రేటర్‌ వాసులు నిరాసక్తత వదిలి ఉత్సాహంగా ఓటు వేసేలా ఏ మేరకు ఫలితమిస్తాయనేది తేలాల్సి ఉంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సీట్లు అత్యంత కీలకంగా మారాయి. గ్రేటర్ పరిధిలో ఓటర్లు దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారు కాస్త ఎక్కువగానే ఉంటారు. తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారూ భారీగానే ఉంటారు. అచ్చమైన హైదరాబాదీలు చాలా తక్కువనే చెప్పాలి. పోలింగ్‌ డేట్‌ సమీపిస్తోంది. ఈ నెల 30న తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి.

ప్రతీసారి ఓటింగ్‌ శాతం తగ్గిపోతుండగా సామాజిక బాధ్యతలో భాగంగా ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో హైదరాబాద్ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటింగ్ రోజున నగరంలోని 2వేల600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళతామని ప్రకటించింది. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలనుకునే ఓటర్లకు సాయం చేస్తామని తెలిపింది. తద్వారా ఓటింగ్ శాతం పెరిగేలా తమవంతు తోడ్పాటు అందిస్తామని ర్యాపిడో ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా యువ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో ఉచిత రైడ్ పథకం ఉపయోగపడుతుందని భావిస్తోంది. భారతదేశానికి ప్రజాస్వామ్యమే అతిపెద్ద ఆభరణమని ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవడంలో తమవంతు సహకారం అందిస్తామని ర్యాపిడో వివరించింది.

పోలింగ్‌ ఎక్కువ నమోదైతే రాజకీయ పార్టీల భవితవ్యం కూడా తారుమారు అయ్యే చాన్స్‌ ఉంది. రాజకీయ పార్టీలు కూడా నగరవాసులు పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఓటర్‌ స్లిప్పుల పంపిణీ సహా పోలింగ్‌ కేంద్రాల సమాచారం చేరవేస్తున్నాయి. మరి ఈసారైనా గ్రేటర్‌ వాసులు ఓటు ఆయుధాన్ని వాడతారా? లేదంటే ఎప్పటిలా పోలింగ్‌ రోజు హాలిడే వచ్చింది కదా అని ఇళ్లకే పరిమితం అవుతారా అనేది పోల్‌ పర్సెంటేజీ నిర్ణయించనుంది.

.

.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×