E-Paper
Advertisement

Greater Voter: పోలింగ్ డే.. జాలీ డే.. రికార్డును కాపాడుకున్న భాగ్యనగర వాసులు

Greater Voter: పోలింగ్ డే.. జాలీ డే.. రికార్డును కాపాడుకున్న భాగ్యనగర వాసులు
Greater Voter updates

Greater Voter updates(Election news in telangana):

గ్రేటర్ హైదరాబాద్ ఓటరు ఎప్పటి లాగే ఇంటి నుంచి కదల్లేదు.. హాలిడేను జాలిడేగా ఎంజాయ్ చేశారు. పోలింగ్ ను మరీ లైట్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో వీర లెవెల్ లో ఎనాలసిస్ లు, పోస్టులతో యాక్టివ్ గా ఉన్న సిటీ నెటిజన్లు.. పోలింగ్ కేంద్రాల దగ్గర అసలే కనిపించలేదు. అక్షరాస్యత శాతంలో టాప్ లో ఉండే హైదరాబాద్.. పోలింగ్ శాతంలో ఎందుకంత వెనకబడుతోంది? ఎక్కడుంది లోపం? అధికారులు ఎంత అవగాహన కల్పించినా వినరు. ఓటేస్తే మాకు వచ్చేదేంటి ? అనే ఆలోచన ధోరణిలో భాగ్యనగర ఓటర్లున్నట్లు కనిపిస్తోంది. గురువారం జరిగిన పోలింగ్ లో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. అత్యల్ప ఓటింగ్ శాతం హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం.

భాగ్యనగర వాసులు మళ్లీ తమ రికార్డు కాపాడుకున్నారు. ఓటింగ్ 50 శాతం దాటకుండా జాగ్రత్త పడ్డారు. అవును పోలింగ్ శాతం పెంచితే ఏమవుతుందనుకున్నారో ఏమోగానీ.. హాలిడేను జాలిడేగా గడిపేశారు. టెకీల్లో అడుగు బయటపెట్టిన వారే అరుదు. పోలింగ్ డే ను పక్కాగా లాక్ చేసి ప్యాక్ చేసేశారు.

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన 12 కుటుంబాలు 18 కిలోమీటర్లు ఉదయం 7 గంటల నుంచి గుట్టలెక్కి.. వాగులు దాటి… కాలినడకన వచ్చి ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. తిరిగి మళ్లీ వెళ్లిపోయారు. వీరంతా ఓటు తమ బాధ్యతగా తీసుకున్నారు. మరి రోడ్లు ఉండి.. వాహనాలు ఉండి.. ర్యాపిడో లాంటి సంస్థలు ఫ్రీ బైక్ రైడ్ ఆఫర్ చేసినా సిటీ జనం ఎందుకు కదలలేదు? సిటీ పోలింగ్ బూత్ లలో ఎక్కడ చూసినా ఖాళీ ఖాళీగానే కనిపించాయి. కాస్తో కూస్తో సీనియర్ సిటిజన్లే నయం. ఓటు తమ హక్కు అని.. బాధ్యతగల పౌరులుగా పోలింగ్ బూత్ ల వరకూ వెళ్లి ఓటువేశారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఒక్క ఓటు ఐదేళ్ల తలరాతను మారుస్తుందని అందరికీ తెలుసు. అయితేనేం.. ఈ ఎన్నికలతో తమకు అసలు సంబంధమే లేదన్నట్లుగా హైదరాబాద్ సిటీ జనం వ్యవహరించారు. ముఖ్యంగా నెటిజన్లు.., టెకీలు, యువత ఈసారి కూడా చాలా మంది ఓటుకు దూరంగానే ఉన్నారు. అదేంటోగానీ ఓటింగ్ డే అంటేనే ఎక్కడలేని నీరసం, ఆయాసం వచ్చినట్లుగా ఫీలయ్యారు. పోలింగ్ కేంద్రాన్ని వెతికి పట్టుకుని.. క్యూలైన్లో నిల్చుని ఓటేయడానికి మహా బద్దకించారు.

సినిమా స్టార్లు, వీఐపీలు, సెలబ్రిటీలు తమ బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి.. టైం కుదుర్చుకుని.. ఉదయం 7 గంటల నుంచే ఓటేసేందుకు క్యూలైన్లో నిల్చున్నారు. అలాంటిది కామన్ మ్యాన్ కు వచ్చిన సమస్యేంటన్న ప్రశ్నలున్నాయి. గ్రేటర్ పరిధిలో ఎప్పుడూ 50 శాతం దాటి పోలింగ్ నమోదు కాలేదు. ఇప్పుడూ అదే రికార్డు భద్రంగా ఉంది. మరి అట్లుంటది మనతోని అంటున్నారు గ్రేటర్ సిటీ జనం.

ఈసారి హైదరాబాద్ లో ఓటింగ్ శాతం ఎలాగైనా పెంచాలని స్వచ్ఛంద సంస్థలు, ఎన్నికల అధికారులు అవేర్ నెస్ కల్పించారు. ఎన్ని చెయ్యు మేం మారమంటే మారము అని మళ్లీ సిటీ జనం నిరూపించుకున్నారు. హైదరాబాద్ సిటీలో దాదాపు ఏడున్నర లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. వీరిలో చాలా మందికి లోకల్ గానే ఓటు హక్కు ఉంది. అయినా కదల్లేకపోయారు.

నిజానికి సిటీలో వరదలు వర్షాలు వచ్చినప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో జీహెచ్ఎంసీకి కంప్లైంట్లు ఇవ్వడంలో ముందుంటారు. కానీ ఓటింగ్ అంటేనే ఎందుకో వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. రెండ్రోజులు సెలవులొస్తే హాయిగా కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నారేగానీ.. ఐదేళ్లు తమని పాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఓటింగ్‌ కోసం ఇచ్చిన సెలవును పర్సనల్ పనులకు, లేదంటే రెస్ట్ తీసుకోవడానికే వాడుతున్నారు. ఇప్పుడూ అదే చేశారు. అదీ సంగతి.

అక్షరాస్యత ప్రకారం చూస్తే.. హైదరాబాద్‌ 83 శాతం, రంగారెడ్డి 71, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి 82 శాతం ఉంది. 2009, 2014, 2018 ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 24 అర్బన్‌ నియోజక వర్గాల్లో ఒక్క పటాన్‌చెరు మినహా మరెక్కడా పోలింగ్‌ 60 శాతాన్ని మించలేదు. 2018లో పటాన్ చెరులో 76 శాతం ఓటింగ్ నమోదైంది. మిగితా సిటీ నియోజకవర్గాలన్నీ అంతంతే. ఆ మాత్రం ఓట్లు వేసిన వారంతా పట్టణ పేదలే. వారు కదలడంతో ఆ మాత్రమైనా ఓటింగ్ శాతం నమోదైంది. ఇప్పుడూ అదే రిపీటైంది. పెద్దగా తేడా ఏమీ లేదు.

అసలు విచిత్రం ఏంటంటే.. నిరక్ష్యరాస్యత ఎక్కువున్న జిల్లాల్లోనే ప్రతిసారి అత్యధిక ఓటింగ్ శాతం నమోదవుతూ వస్తోంది. ఇప్పుడూ అదే కనిపించింది. ఎప్పటిలాగే గ్రామీణ ఓటర్లు పోటెత్తితే.. సిటీ ఓటర్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఒక్క అసెంబ్లీ ఎన్నికలే కాదు… ఎంపీ ఎలక్షన్లు… జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే రీతిలో ఓటింగ్ శాతం నమోదైంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం… 2002లో జరిగిన ఎంసీహెచ్‌ ఎన్నికల్లో కేవలం 41.22 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009లో వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి ఎన్నికల కమిషన్‌ ఎన్నో అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది. అయినా, కేవలం 42.92 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 45.27 శాతం మాత్రమే ఓటేశారు. ఇక 2020 గ్రేటర్ ఎన్నికల్లో 46 శాతం పోలింగ్ నమోదైంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 45 శాతం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం రికార్డయింది. ఇప్పుడూ ఆ రికార్డు దాటలేకపోయింది.

అయితే సిటీ ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండడానికి చాలా కారణాలు చెబుతున్నారు. రాజకీయాల తీరుతో విసిగిపోయి ఉండటంతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారన్న వాదన కూడా ఉంది. ఇంకోవైపు డూప్లికేషన్ పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో ఊళ్లల్లో, సిటీలో రెండు చోట్ల ఓట్లు ఉన్నవారిలో కొందరు.. ఊరెళ్లి ఓటేసేందుకే ఆసక్తి చూపారంటున్నారు. పోలింగ్ రోజు సిటీ ఖాళీ అవడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×