Hyderabad: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ, పంచవటి కాలనీలో స్థల వివాదం కారణంగా కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే.. డీజీపీ కార్యాలయం మాత్రం కాల్పులు జరగలేదని, గన్తో బెదిరింపులు మాత్రమే జరిగాయని స్పష్టం చేసింది. ఈ మొత్తం వివాదం కేఈ ప్రభాకర్, ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య ఆస్తి పంచాయితీగా వెలుగులోకి వచ్చింది.
మణికొండ పంచవటి కాలనీలో ఉన్న ఓ భవనం విషయంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్ కుమారుడైన ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య వివాదం నెలకొంది. ఈ భవనం విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని బాధితులు తెలిపారు. ఈ భవనంలో అభిషేక్ గౌడ్ ‘కృష్ణ ధర్మ పరిషత్’ కార్యాలయాన్ని నిర్వహించేవారు. కార్యాలయం కోసం అభిషేక్ గౌడ్ ఈ భవనాన్ని రూ.2 కోట్లు ఖర్చు చేసి రెనొవేట్ చేశారని బాధితుడు వెంకటేష్ గౌడ్ (అభిషేక్ గౌడ్ మామ) వివరించారు. రెండు నెలల తర్వాత అందులో ఉంటానని చెప్పి వచ్చిన కేఈ ప్రభాకర్, ఆరు నెలలుగా తాము అభివృద్ధికి ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 25వ తేదీన కేఈ ప్రభాకర్ వద్దకు వెళ్లగా.. ఆయన మద్యం మత్తులో వారిని బెదిరించినట్లు తెలిపారు.
బాధితుడి వర్షన్..
అక్టోబర్ 25న కేఈ ప్రభాకర్ తన ఫార్చునర్ కారులో నుంచి రివాల్వర్ తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారని.. ప్రాణ భయంతో తాము అక్కడి నుంచి పారిపోయి, అదే రోజు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితుడు వెంకటేష్ గౌడ్ వెల్లడించారు. కాల్పులు జరిపిన అనంతరం ప్రభాకర్ అనుచరులు తమను స్థలంలో నుండి బయటకు గెంటేసి.. గేటుకి తాళాలు వేసినట్లు కూడా ఆయన ఆరోపించారు. కేఈ ప్రభాకర్ నుండి తమకు ప్రాణ హాని ఉందని.. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
స్పందించిన డీజీపీ
ఈ ఘటనపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఘటనకు సంబంధించి ఎలాంటి కాల్పులు జరగలేదని స్పష్టం చేశారు. ఇది మామ-అల్లుళ్ల మధ్య ఆస్తి పంచాయితీ అని, కేఈ ప్రభాకర్ కూడా తన అల్లుడు అభిషేక్ గౌడ్పై గన్ పెట్టి బెదిరించాడని ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే అభిషేక్ గౌడ్పై అక్టోబర్ 25వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు డీజీపీ వివరించారు. ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు ఈ కాల్పుల ఆరోపణలు, గన్తో బెదిరింపుల అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆస్తి వివాదంలో ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. పోలీసుల విచారణ కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.