Jubilee Hills By-election: కేసీఆర్, హరీష్ రావులను సీబీఐ ఎప్పుడు అరెస్ట్ చేస్తుందో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రహమత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్ (పీజేఆర్ సర్కిల్) వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 30,000 మెజారిటీతో గెలవబోతున్నారని, ఈ గెలుపు చప్పుడు ఫామ్ హౌస్లో ఉన్న తండ్రీకొడుకులకు గుండెలు అదిరేలా వినిపించాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్:
కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు పదే పదే చెప్పారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ‘‘కాళేశ్వరం కేసును సీబీఐ కి పంపిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామన్నారు. మీరు, వాళ్లు ఒక్కటి కాకపోతే, బీఆరెస్, బీజేపీ ది ఫెవికాల్ బంధం కాకపోతే, ఈ నెల 11 లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ చేయాలి. కెసీఆర్, హరీష్, కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు.’’ అని అన్నారు. ఇందులో మీ చీకటి ఒప్పందం ఏంటనీ ప్రశ్నించారు. ‘‘చీకటి ఒప్పందం చేసుకుని జూబ్లీహిల్స్ లో బీజేపీ బీఆరెస్ కు పరోక్ష మద్దతు ఇస్తోంది. ఎందుకంటే. రాబోయే రోజుల్లో బీఆరెస్ బీజేపీ లో విలీనం అవుతుంది. ఇది నేను అంటున్నది కాదు.. వాళ్ల ఆడబిడ్డ చెబుతున్నదే’’ అని తెలిపారు.
బీఆర్ఎస్ నేతల ‘సింపతీ’ డ్రామా:
“సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోతే, ఆయన సతీమణిని గెలిపించాలని అడుగుతున్నారు. కానీ ఇదే కేసీఆర్, 2007లో పేదల దేవుడు, దివంగత నేత పి. జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) మరణించినప్పుడు ఏం చేశారు?” అని ప్రశ్నించారు. “ఆనాడు పీజేఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞత ప్రదర్శించి, ఏకగ్రీవానికి అంగీకరించి పోటీ పెట్టలేదు. కానీ కేసీఆర్ మాత్రం, సెంటిమెంట్ లేదంటూ పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టారు. మద్దతు అడగడానికి వెళ్లిన పీజేఆర్ భార్యను, కుటుంబాన్ని మూడు గంటల పాటు గేటు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్,” అని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. పీజేఆర్ మీద పోటీ పెట్టినందుకు బీఆర్ఎస్ నేతలు రహమత్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాకే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
ఈ ఉప ఎన్నికలో ప్రచారం సందర్భంగా జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుకు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే, ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 4,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న మిత్రపక్షాలైన ఎంఐఎం (అసదుద్దీన్ ఓవైసీకి ప్రత్యేక కృతజ్ఞతలు), సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సొంత చెల్లెల్నే గెంటేసిన కసాయి కేటీఆర్:
మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. “ఆడబిడ్డను ఆదుకోవాలని కేటీఆర్ చెప్తున్నారు. కానీ తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్నే మెడలు పట్టి బయటకు గెంటించిన కసాయి కేటీఆర్ కాదా?” అని నిలదీశారు. “సొంత చెల్లెలికే బుక్కెడు అన్నం పెట్టనోడు… ఇప్పుడు మరొకరిని ఆదుకుంటాడట,” అని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ఐదేళ్ల పాటు మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వని కేసీఆర్, కేటీఆర్లకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు నాయకత్వం ఇచ్చిందని, తమ మంత్రివర్గంలో సీతక్క, కొండా సురేఖ వంటి వారికి గౌరవం ఇచ్చిందని గుర్తుచేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూబ్లీహిల్స్లోనే 14,159 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. “మేము 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే, బీఆర్ఎస్ నాయకులు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ఆ పథకాన్ని ఆపాలని చూస్తున్నారు,” అని విమర్శించారు. “మీ రేషన్ కార్డు రద్దు చేయడానికా బీఆర్ఎస్ను గెలిపించేది? మీ ఉచిత కరెంట్ ఆపడానికా? ఆడబిడ్డల బస్సు ప్రయాణం ఆపడానికా?” అని ప్రజలను ప్రశ్నించారు.