Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యవసాయ భూమి వద్దకు కాంగ్రెస్ ఎంపీల పర్యటన కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని స్పష్టం చేశారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వంపై విమర్శల బాణాలు సంధించారు.
22A ఆంక్షలతో ప్రజలకు నరకం..
రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల రైతులకు రైతుబందు అందక, ఇళ్ల స్థలాలు అమ్ముకోలేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో కాంగ్రెస్ బండారం బయటపడుతుందనే భయంతోనే తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
ఒక్క తప్పున్నా భూమి ఇచ్చేస్తా..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను హరీశ్ రావు పూర్తిగా ఖండించారు. ‘ నా వ్యవసాయ భూమిలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదు. కనీసం బాత్రూం కూడా లేదు. 2018 నుంచి చట్టబద్దంగా కొనుగోలు చేసిన 13 ఎకరాల భూమి ఉంది. అధికారులతో సర్వే చేయిస్తే నా భూమి 2 గుంటలు తక్కువే ఉందని తేలింది. ఇందులో ఏ చిన్న తప్పు ఉన్నా మెుత్తం భూమిని ప్రభుత్వానికే రాసిచ్చేస్తా’ అని సవాల్ విసిరారు.
ఢిల్లిపై దండయాత్ర చేయండి..
కేసీఆర్ దళితుల భూములను కబ్జా చేయలేదని తేలితే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. సొంత రాష్ట్ర నాయకులపై రాజకీయ కక్ష సాధింపు యాత్రలు చేయడం మానేసి, విభజన హామీలు, ప్రాజెక్టుల అనుమతుల కోసం కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై దండయాత్ర చేయాలని హరీశ్ రావు హితవు పలికారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.
Also Read: హైకోర్టు తీర్పుకు జై.. సుప్రీంకు వెళ్లేది లేదంటున్న దానం నాగేందర్!