KTR: బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలకు హైకోర్టు తీర్పు రూపంలో తొలి పెద్ద షాక్ తగిలింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామంపై బీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. తమ పోరాటానికి లభించిన తొలి విజయంగా వర్ణించింది.
కేటీఆర్ ట్విట్..
తీర్పు వెలువడిన వెంటనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆయన.. న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. పార్టీ మారిన దానం నాగేందర్కు పట్టిన గతే, కాంగ్రెస్లో చేరిన మిగతా ఎమ్మెల్యేలకు కూడా త్వరలోనే పడుతుందని హెచ్చరించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి ఇతర పార్టీలోకి వెళ్లిన వారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదని అభిప్రాయపడ్డారు.
పోరాటం ఆపేది లేదు: పాడి కౌశిక్ రెడ్డి
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ తీర్పుపై మండిపడ్డారు. ‘అమ్ముడుపోతే అనర్హత వేటు తప్పదని మేం మొదటి నుంచీ చెబుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ హైకోర్టు తీర్పు అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని చెంపదెబ్బ అని, మిగిలిన ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు పడేంత వరకు తమ చట్టపరమైన, రాజకీయ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: ఒక్క చుక్క నీటిని వదులుకోం! కృష్ణా జలాలు, కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ