Harish Rao : కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్రావు విచారణ ముగిసింది. సుమారు 40 నిమిషాలపాటు కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. ఇరిగేషన్ మంత్రిగా ఎన్ని రోజులు పని చేశారు? ఆనాటి మంత్రుల సబ్ కమిటీలో ఏం చర్చించారు? ఏ నిబంధనల కింద కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ? ఏ ప్రాతిపదికన, ఏ షరతులతో, ఎలాంటి గ్యారెంటీలతో లక్ష కోట్లకు పైగా నిధులను తీసుకొచ్చారు? కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకొచ్చిన నిధులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఎందుకు మళ్లించాల్సి వచ్చిందనే ప్రశ్నలను కమిషన్ సంధించినట్టు సమాచారం. కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు? అన్నారం, సుందిళ్ల లొకేషన్లు మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? ప్రాజెక్టుల లొకేషన్లు మార్చే అధికారం హైపవర్ కమిటీకి ఉందా? కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణమేంటి? కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల తిరిగి ఎలా చెల్లించాలనుకున్నారు? కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా? నిర్మాణ సంస్థలకు స్థలాలు ఎందుకు ఆలస్యంగా ఇచ్చారు? మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్గా నీళ్లు ఇవ్వొచ్చని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందా? బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేశారా? కాళేశ్వరం ద్వారా ఎన్ని TMCల నీళ్లు నిల్వ చేశారు? బ్యారేజీల్లో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లు నిల్వ చేశారా ? బ్యారేజీల్లో నీళ్లు నింపమని ప్రభుత్వం ఆదేశించిందా? ఇలా అనేక ప్రశ్నలతో హరీష్రావును కమిషన్ ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. విచారణ ప్రారంభ సమయంలో అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అంటూ హరీష్ రావుతో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రతిజ్ఞ చేయించారు. హరీష్ రావును 40 నిమిషాల పాటు 20 ప్రశ్నలు అడిగారు.
హరీష్ రావు ఏం చెప్పారంటే..
తమ్మిడి హట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ ను ఎందుకు మార్చారు అనేదానిపై చాలాసేపు చర్చ జరిగిందని విచారణ అనంతరం హరీష్ రావు చెప్పారు. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టే తుమ్మిడిహట్టి వద్ద నుంచి మేడిగడ్డకు మార్చామని చెప్పానన్నారు. CWC, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగిందని అన్నారు. 16 లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వాలంటే రిజర్వాయర్ల సంఖ్య పెంచాలన్న CWC సూచనల మేరకే.. బ్యారేజీలు, రిజర్వాయర్ల సంఖ్య పెంచామని చెప్పారు. మేడిగడ్డ నిర్మాణ నిర్ణయం ఒక్కరిదే కాదని.. దీనిపై మంత్రులు అనేకసార్లు భేటీ అయ్యారని హరీశ్రావు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యాప్కోస్ సంస్థ నివేదికల ఆధారంగా… మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించామని హరీష్రావు సమాధానమిచ్చారు. మేడిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం రిపోర్టులు ఇచ్చారని చెప్పుకొచ్చారు. లోన్స్ కోసమే కార్పొరేషన్ను ఏర్పాటు చేశామని.. నీళ్లను అమ్మి రీపేమెంట్ చేయాలనుకున్నామని చెప్పారు. బ్యారేజీల్లో నీళ్లు నింపమని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందా? అని కమిషన్ అడిగితే.. అది ఇంజనీర్లు చూసుకోవాల్సిన అంశమని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పినట్టు హరీశ్ రావు తెలిపారు.
హరీష్రావే కీలకం..
కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడానికి ముందు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ఫాంహౌజ్లో కేసీఆర్తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. లీగల్ టీమ్తో, ఇరిగేషన్ నిపుణులతో మాట్లాడారు. ఆనాటి కాళేశ్వరం ఫైల్స్ అన్నీ మరోసారి తిరగేశారు. పక్కా కసరత్తుతో కమిషన్ ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు హరీష్రావు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపకర్తల్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావులే కీలకం. మేడిగడ్డ కూలడంలోనూ వాళ్లిద్దరే బాధ్యత వహించాలని అంటున్నారు. అందుకే, కమిషన్ ముందు హరీష్ హాజరవడం రాజకీయంగాను ఉత్కంఠ క్రియేట్ చేసింది.
హరీష్రావు ఏం చెప్పారు?
హరీష్రావును సుదీర్ఘంగా విచారిస్తారని.. గంటల తరబడి ఎంక్వైరీ నడుస్తుందని చాలామంది భావించారు. అలాంటిది 45 నిమిషాల్లోనే విచారణ ముగియడం ఆసక్తికరంగా మారింది. ముందే ప్రిపేర్ అయి రావడంతో.. కమిషన్ ప్రశ్నలన్నిటికీ హరీష్ గడగడా సమాధానాలు చెప్పేశారా? అసలు కింగ్ పిన్ కేసీఆరేనని.. తనకేమీ తెలీదని అన్నారా? కేసీఆర్ను ఇరికించేశారా? లేదంటే, గులాబీ బాస్కు ఏం సంబంధం లేదని అంతా తన మీదనే వేసుకున్నారా?
ఈటల ఇరికించేశారా?
ఇటీవలి విచారణలో ఈటల రాజేందర్ సైతం అంతా ఆ ఇద్దరే చేశారంటూ కేసీఆర్, హరీష్లను దాదాపు ఇరికించినట్టే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా కాళేశ్వరం నిర్వహించారన్నారు. ఈటల వాఖ్యల తర్వాత.. లక్ష కోట్ల నిధులను ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఏ విధంగా సేకరించారో హరీష్రావు కమిషన్ ముందు చెప్పారా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు, ఇరిగేషన్ శాఖ చెప్పినట్టే కాళేశ్వరంలో విధులు నిర్వహించాం, పనులు చేపట్టాం అంటూ ఇప్పటికే కమిషన్ ముందు అధికారులు సైతం వివరణ ఇచ్చారు.