Million March case: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2011లో మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ పరిణామంతో గత 15 ఏళ్లుగా సాగుతున్న న్యాయపరమైన ఉత్కంఠకు తెరపడింది.
ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు. ఆనాడు జరిగిన ఘటనలతో వీరికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, కేవలం రాజకీయ కారణాలతోనే నిందితులుగా చేర్చారని కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం, నిందితులపై ఉన్న అభియోగాలకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసులను కొట్టివేసింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011 మార్చి 10న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ నిర్వహించారు. అప్పట్లో ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ వేలాదిగా తరలివచ్చిన ఉద్యమకారులతో ట్యాంక్ బండ్ పరిసరాలు దద్దరిల్లాయి. ఈ క్రమంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, విగ్రహాల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తుల నష్టంపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులను నిందితులుగా చేర్చారు. ఒకవైపు కేబినెట్ మీటింగ్లో కాళేశ్వరం అంశంపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతున్న తరుణంలో, ఉద్యమ కాలం నాటి కేసుల్లో కేసీఆర్ బృందానికి ఊరట లభించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Read Also: బీఆరెస్ చేసిన తప్పులు, లోపాలే కవితకు పాఠాలు! అవే కొత్త పార్టీకి మార్గదర్శకాలు…