బీఆరెస్కు ప్రత్యామ్నాయం మేమే.. అనే రేంజ్లో కవిత కొత్త పార్టీ ముందుకు రాబోతున్నది. కేసీఆర్ను, ఆయన పాలనను, పార్టీ విధానాలను బాగా దగ్గరగా కవిత చూశారు. జనానికి క్రమంగా ఆ పార్టీ ఎందుకు దూరమవుతూ వస్తోందో కూడా ఆమె అధ్యయనంలో ఉన్న విషయమే. విషయ పరిజ్ఞానంలో తండ్రి బాటలో నడిచిన ఆమె.. తండ్రి అనుసరించిన కొన్ని విధానాలను మాత్రం పూర్తిగా వ్యతిరేకించారు. ఆ పార్టీలో ఉన్నప్పుడే తాను కేసీఆర్కు లేఖలు రాసే అలవాటున్నట్టు ఆమె తర్వాత క్రమంలో చెప్పడం చూశాం.
చాలా మంది అనుకున్నారు… పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆరోపణలు చేస్తున్నారని. కానీ ఆమె పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చాలా సందర్బాల్లో ఆమె విమర్శించిన దాఖలాలున్నాయని తరువాత వెల్లడయ్యింది. ఇక జనం నాడి తెలుసుకుని, వారికి దగ్గరయ్యే క్రమంలో కవిత పరిణతి సాధించారనే చెప్పాలి. జాగృతి జనం బాటతో ఆమె మొన్న తెలంగాణ మొత్తం చుట్టి వచ్చినా..అంతకు ముందే ఆమె రాజకీయాలపై, జనం తీరు, వారి ఆభీష్టాలపై ఓ స్పష్టమైన అభిప్రాయం ఉంది. అయితే ఆమె కొత్త పార్టీ ఆవిర్బావం నేపథ్యంలో.. జెండా, ఎజెండాపై సుధీర్ఘ చర్చ జరుగుతోంది. పార్టీ పేరుపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమె రాజకీయ విమర్శాలు చాల సూటిగా గుచ్చుకున్నట్టే ఉంటాయి.
అదీ బీఆరెస్ , కేసీఆర్ విషయంలోనైతే నేరుగా బాణాలు వేస్తున్నారు. మండలిలో ఆమె మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. తనను పార్టీలోంచి బహిష్కరించడానికి కారణం చెబుతూనే.. బీఆరెస్ చేసిన తప్పిదాలను, పాలన పరమైన దోషాలను, తప్పుడు నిర్ణయాలను ఆమె ఎండగట్టారు. మరి ఇవన్నీ కేసీఆర్కు తెలియవా? అంటే .. తెలుసు. కానీ రియలైజ్ అయ్యే చాన్స్ అక్కడ లేదు. తెలిసినా .. కొందరు ఆయనతో చెప్పే ధైర్యం లేదు. అంతిమంగా అక్కడ కేసీఆర్ అనుకున్నదే జరగాలి. అది మంచైనా. చెడైనా. ఒకేవేళ అది మార్చుకోవాలన్నా.. కేసీఆర్ మనసుకు రావాలె. లేదంటే.. ఆ నిర్ణయాలు, విధానాలు నష్టం చేసినా.. అవే ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంటాయి.
ఈ విషయాన్ని బాగా గమనించారు కవిత. అందుకే ఆమె కొత్త పార్టీ విధివిధానాలు, ఎజెండా రూపకల్పనకు కేసీఆరే ఆద్యుడని చెప్పాలి. ఆయన్ను చూసే కవిత తన కొత్త పార్టీకి కొత్త పంథాను, జనం దోవను ఎంచుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆరెస్గా మార్చి పార్టీలో తెలంగాణ అనే పదమే లేకుండా చేయడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. అందుకే పదే పదే ఆమె చెబుతూ వస్తున్నారు. తన కొత్త పార్టీలో తెలంగాణ కచ్చితంగా ఉంటుందని. అంతే కాదు.. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ కొత్త పార్టీ లక్ష్యమని, ఇతర రాష్ట్రాల జోలికి వెళ్లబోమని ఆమె వేసిన సెటైర్ నేరుగా కేసీఆర్కే తగిలింది. ఇక మహిళలకు కేసీఆర్ పార్టీలో, ప్రభుత్వంలో ఇచ్చిన విలువ, వారి స్థానం ఏమిటో కూడా చాలా సార్లు విడమర్చి చెప్పారు. సూటిగా విమర్శించారు.
అలా మేముండబోమన్నా ఆమె.. ఏకంగా తన పార్టీలో టికెట్లు, పదవులు… మహిళా రిజర్వేషన్ను అనుసరించే ఇస్తానని కూడ ప్రకటించారు. బీసీలకు బీఆరెస్ దూరమైంది. కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారు. రిజర్వేషన్ల కోసం పోరాడారు. ఇప్పుడు కొత్త పార్టీలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యతనిస్తారనేది స్పష్టం. సామాజిక తెలంగాణ విషయంలో బీఆరెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కవిత అదే తన పార్టీ నినాదంగా మార్చుకున్నారు. ఉద్యమకారులను విస్మరించారు కేసీఆర్. కవిత ఉద్యమకారులకు ఊతంగా నిలుస్తున్నారు. వారికి సముచిత ప్రాధాన్యతనిస్తామని ప్రకటించారు. వారికిచ్చిన హామీ అమలు కోసం ప్రభుత్వంపైనా ఒత్తిడి తెచ్చి సాధించే క్రమంలో సక్సెసయ్యారు.
కేసీఆర్ చేయనవి, బీఆరెస్ పార్టీ అనుసరించనివి… అన్నీ కవిత చేసి చూపాలనుకుంటున్నారు. అందుకే పార్టీ పెట్టకముందే ప్రధాన పక్షం తామేననే విధంగా దూకుడు ప్రదర్శించారు. ఇప్పుడు పార్టీ పెట్టిన తరువాత బీఆరెస్కు ప్రత్యామ్నాయం మేమే అన్నట్టుగా మరింత స్పీడు పెంచేలా కనిపిస్తున్నారు.
కురువృద్ధులను, తెలంగాణ వ్యతిరేక శక్తులను పార్టీలో చేర్చుకుని, వారే మాకు యూత్ అని జీవన్రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ అన్న మాటలను కూడా కవిత తీవ్రంగా ఆక్షేపించారు. మరి తెలంగాణలో యూత్ ఎటుపోవాలంటూ సెటైర్లు వేశారు. తను మాత్రం యూత్కు పెద్ద పీట వేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.