ప్రస్తుత సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మహా నగరంలో నార్సింగి నుంచి బిర్లా మందిర్ వరకు ప్రయాణించిన ఒక మహిళ తన విలువైన నగలను ఆటోలోనే వదిలేసింది. సుమారు 6.5 తులాల బంగారం (రూ.9 లక్షల విలువైన బంగారం)తో పాటు కొంత నగదు ఉన్న ఆ బ్యాగ్ భద్రంగా తిరిగి లభించడంతో బాధితురాలు ఊపిరి పీల్చుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆటో డ్రైవర్ చూపిన నిజాయితీ పోలీసుల ప్రశంసలు అందుకుంది.
మర్చిపోయిన బ్యాగ్.. మొదలైన టెన్షన్
నార్సింగి ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఉబెర్ ఆటోలో బిర్లా మందిర్ సందర్శన కోసం బయలుదేరింది. ప్రయాణం ముగిసిన తర్వాత ఆమె హడావుడిగా ఆటో దిగిపోయింది. తన వెంట ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఆటోలోనే ఉండిపోయిన విషయం గమనించలేదు. గమ్యస్థానం చేరుకున్న కాసేపటికి గానీ ఆమెకు బ్యాగ్ కనిపించలేదనే విషయం అర్థం కాలేదు. అందులో ఏకంగా ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు సహా నగదు ఉండటంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
గంటలోనే రంగంలోకి దిగిన పోలీసులు
సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితురాలు ప్రయాణించిన ఉబెర్ యాప్ వివరాలను పరిశీలించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్ను గుర్తించి వెంటనే సంప్రదించారు. ఫోన్ కాల్కు స్పందించిన డ్రైవర్ నగేష్.. తన ఆటో వెనుక సీటులో ఒక బ్యాగ్ ఉన్నట్లు ధృవీకరించాడు. ప్రయాణికురాలు దిగిపోయిన తర్వాత తాను మరొక సవారీ తీసుకోలేదని.. అది సురక్షితంగా ఉందని వెల్లడించాడు. ఆ వెంటనే పోలీసుల సూచన మేరకు నగేష్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు.
అభినందనలు.. నగదు పురస్కారం
పోలీసుల సమక్షంలో డ్రైవర్ నగేష్ ఆ బ్యాగ్ను బాధితురాలికి అప్పగించాడు. అందులోని 6.5 తులాల బంగారం సహా నగదు అంతా భద్రంగా ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో అంత విలువైన వస్తువులు దొరికితే తిరిగి ఇచ్చే వారు అరుదుగా ఉంటారని.. నగేష్ నిజాయితీ గొప్పదని పోలీసులు కొనియాడారు. డ్రైవర్ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ అతనికి నగదు పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. సకాలంలో స్పందించి విలువైన సొత్తును రికవరీ చేసిన పోలీసులను బాధితురాలు కృతజ్ఞతలతో ముంచెత్తింది.
Also Read: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండ.. రూ. 10 లక్షల పరిహారం, ఉద్యోగ హామీ!