Hyderabad: హైదరాబాద్ శివార్ల ప్రాంతంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఖరీదైన సైబీరియన్ హస్కీ జాతికి శునకాలను రోడ్డుపై వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఎండ వేడిమికి తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. వాటిలో ఓ శునకం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలియగానే సంరక్షణ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తోంది ఓ ఎన్జీవో సంస్థ.
పటాన్చెరు రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు
హస్కీ జాతి శునకాల గురించి చెప్పనక్కర్లేదు. నీలి కళ్లు.. చూడటానికి కాస్త తోడేళ్ల మాదిరిగా కనిపిస్తాయి. మార్కెట్లో వారికి రేటు కూడా ఎక్కువ. అవి తమ ప్రవర్తనతో జంతు ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. చిన్నారులతో స్నేహంగా, ఉల్లాసంగా, అందరితో కలిసిపోతాయి. ఆ జాతి శునకం మార్కెట్లో రూ. 50 వేల నుంచి ధర పలుకుతోంది.
రెండురోజుల కిందట శంకర్పల్లి-పటాన్చేరు రోడ్డుపై దాదాపు డజను హస్కీ జాతి శునకాలు దర్శనమిచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేశారు. చల్లని ప్రదేశంలో ఉండే ఈ శునకాలు ఎండ వేడిని తట్టుకోలేవు. మండే ఎండలో ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించిపోయాయి. అందులో ఓ శునకం చనిపోయింది కూడా.
ఎండ వేడిమికి తట్టుకోలేక ఒకటి మృతి.. అడవిలోకి మరికొన్ని
మరికొన్ని కనిపించకుండా పోయాయి. అయితే వీటిని ఎవరు తెచ్చారు? ఎందుకు వదిలివెళ్లారనేది ఇంకా తెలియాల్సివుంది. దాదాపు వాటి వయస్సు రెండు నుంచి నాలుగేళ్ల వరకు ఉంటాయని అంటున్నారు. రెండు రోజుల కిందట రోడ్డుపై వాటిని గమనించిన ఓ షాపు ఓనర్, జంతు పరిరక్షణ సంస్ధ ప్రతినిధులకు సమాచారం ఇచ్చాడు.
సిబ్బంది అక్కడికి వచ్చేసరికి చాలా కుక్కలు సమీపంలోని అడవుల్లోకి వెళ్లిపోయాయి. కొన్నింటిని గుర్తించిన వాహనదారులు, వాటిని తమ కార్లలో తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఎనిమిది శునకాలు ఎన్జీవో సంరక్షణలో ఉన్నాయి. హస్కీ జాతి కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. మరో 3 రోజులు వడగళ్ల వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
బ్రీడర్లు-రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిబ్బంది తప్ప పెద్ద సంఖ్యలో హస్కీ జాతి కుక్కలు ఉండవని అంటున్నారు. వాటికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అక్రమ బ్రీడింగ్ సెంటర్లపై నిఘా పెరగడంతో వారు వదిలేశారా? వాటి పోషణ భారంగా భావించి వదిలించుకున్నారా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.