Gurukulam Safety: స్వేచ్చ బ్యూరో: హుజూరాబాద్ పట్టణ పరిధిలోని బోర్నపల్లి శివారులో కొనసాగుతున్న వీణవంక మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల పర్యవేక్షణా లోపాలు, భద్రతా వైఫల్యాలకు నిలయంగా మారింది. విద్యార్థులు వరుసగా బయటకు వెళ్లిపోతున్నా యాజమాన్యం తీరు మారకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థులు గేటు దాటి పట్టణంలోని ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద తిరుగుతుండగా కొందరు స్థానికులు గమనించారు. గురుకులంలో రాత్రి భోజనం పెట్టలేదా? లేక పెట్టిన తిండి బాగోలేక ఆకలి తాళలేక అర్ధరాత్రి వేళ ఫాస్ట్ఫుడ్ కోసం బయటకు వచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సిన యాజమాన్యం, నాసిరకం భోజనంతో విద్యార్థుల కడుపు మారుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారిని గమనించిన స్థానికులు ఆరా తీసి, తిరిగి గురుకులానికి తీసుకొచ్చి అప్పగించారు. పాఠశాల ఆవరణలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తే విద్యార్థులు బయటకు వెళ్లింది, తిరిగి వచ్చింది స్పష్టమవుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. నిఘా నేత్రాల ఆధారంగా బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాపలా కాయాల్సిన భద్రతా సిబ్బంది నిద్రిస్తున్నారా? అర్ధరాత్రి వేళ విద్యార్థులు బయటకు ఎలా వెళ్లారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాత్రి 11 గంటల సమయంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద కనిపించిన విద్యార్థులను స్థానికులు తీసుకొచ్చి గురుకులంలో అప్పగించిన ఘటనపై ప్రిన్సిపాల్ సంపత్ను ‘స్వేచ్ఛ ప్రతినిధి’ వివరణ కోరగా.. ఆయన దాటవేత ధోరణి ప్రదర్శించారు. “అలాంటిదేమీ లేదు.. వారు మా విద్యార్థులు కారు” అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.
Also read: తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
సెప్టెంబరు 13: గన్ముక్కుల గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి బొంగోని స్నితన్ వేకువజామున పాఠశాల నుంచి తప్పించుకుని రోడ్డుపై వాహనదారులను లిఫ్ట్ అడిగి ఇంటికి వెళ్లిపోతుండగా తల్లిదండ్రులు గుర్తించి చేరదీశారు.
మార్చి నెలలో: సిబ్బంది వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థి శశాంక్ పాఠశాల నుంచి పారిపోయి పట్టణంలోని బస్టాండ్ వద్ద కనిపించాడు. గతంలో సీసీ కెమెరాల పేరిట విద్యార్థులను వేధించారని, ప్రిన్సిపాల్ విద్యార్థులతో కాళ్లు మొక్కించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
నిబంధనల ప్రకారం రాత్రివేళల్లో గురుకులంలోనే ఉండి పర్యవేక్షించాల్సిన వార్డెన్, ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిపోతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందుతూ బాధ్యతలు విస్మరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రహరీ గోడ లేదంటూ సాకులు చెప్పడం మానుకొని, నిరంతర పర్యవేక్షణ చేపట్టడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వరుస ఘటనలకు కారణమైన ప్రిన్సిపాల్, వార్డెన్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.
Also read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ..!