Praja Palana: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల నవ్వులపాలవుతోంది. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న ‘విద్యా వారోత్సవాల’ సన్నాహక సదస్సు బుధవారం అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సిన ఈ సమావేశం.. అధికారుల జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా మొదలు కాలేదు. రెండున్నర గంటల పాటు వేచి చూసినా కీలక అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోవడంతో సదస్సు ఉద్దేశం పూర్తిగా నీరుగారిపోయింది.
నియోజకవర్గ స్థాయి అభివృద్ధిని సమీక్షించాల్సిన ఈ కీలక భేటీకి హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాలకు చెందిన తహసీల్దార్లు (ఎంఆర్ఓలు), ఎంపీడీఓలు మూకుమ్మడిగా డుమ్మా కొట్టడం గమనార్హం. అధికారులు రారు.. కార్యక్రమం మొదలవ్వదు అన్న చందంగా సాగిన ఈ సదస్సులో సమన్వయం పూర్తిగా కరువైంది. కనీసం మండల స్థాయి పర్యవేక్షకులు కూడా రాకపోవడంతో విద్యాశాఖ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాలనా యంత్రాంగాన్ని ముందుండి నడిపించాల్సిన ఆర్డీఓ సైతం ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: ఇంటిపైన నీటి కుండలు.. తర్వాత జరిగే అద్భుతం తెలిస్తే.. ఆశ్చర్యపోవడం పక్కా!
అధికారులే కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు కూడా ఈ సదస్సుపై ఆసక్తి చూపలేదు. జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్తో పాటు కమిషనర్లు, మెజారిటీ కౌన్సిలర్లు మరియు సర్పంచ్లు రాకపోవడంతో సదస్సు హాల్లోని కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. 10 గంటలకు రావాల్సిన వారు 12 దాటినా రాకపోవడంతో, ఉన్న కొద్దిమందితోనే మొక్కుబడిగా కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాల్సిన కీలక తరుణంలో ఇలాంటి ఉదాసీనత ప్రదర్శించడంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టిన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ రెడీ.. ప్రారంభానికి డేట్ ఫిక్స్..!