Water Pot Cooling: ప్రస్తుత రోజుల్లో ఏసీ లేనిదే పగలు గడిచే పరిస్థితి కనబడట్లేదు. అయితే ఇంతటి తీవ్రమైన ఎండలను పూర్వం ప్రజలు ఎలా తట్టుకున్నారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. వారు ఎలాంటి పద్దతులను ఉపయోగించి.. ఎండ నుంచి ఉపశమనం పొందారన్న సందేహం అందరికీ కలుగక మానదు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం వియాత్నంలో కనిపిస్తోంది. అక్కడి ప్రజలు ప్రకృతి సిద్దంగా ఇళ్లను చల్లబరుచుకుంటున్న విధానం.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఏసీ, కూలర్లతో పనిలేకుండా, విద్యుత్ లేకుండా కేవలం నీటి కుండల ద్వారా వేడిని జయిస్తున్నారు. అది ఎలాగో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
సాధారణంగా ఈ రోజుల్లో ఎండలు ముదిరితే మనం చేసే మొదటి పని ఏసీలు ఆన్ చేయడం లేదా కూలర్ల ముందు కూర్చోవడం. కానీ వియత్నాంలోని రద్దీగా ఉండే నివాస ప్రాంతాల్లో ప్రజలు మాత్రం ఒక అద్భుతమైన సంప్రదాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. తమ ఇంటి పైకప్పులపై వరుసగా నీటి కుండలను అమర్చి.. సహజమైన పద్దతిలో గదుల ఉష్ణోగ్రతను తగ్గించుకుంటున్నారు.
ఇంటి పైకప్పుపై పెట్టే నీరు.. ఎండ తీవ్రతకు నెమ్మదిగా ఆవిరవుతుంది. ఈ ప్రక్రియ జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వేడి గాలిని అది ఆకర్షించి.. పరిసరాలను చల్లబరుస్తుంది. దీనివల్ల భవనం పైకప్పు నేరుగా వేడెక్కకుండా ఉంటుందని స్థానిక వియత్నం ప్రజల నమ్మకం. ఫలితంగా కింద ఉన్న గదుల్లో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతోందని వారు అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ పద్దతిని ఉపయోగించి.. వేసవిలోనూ చల్లగా జీవిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
సాధారణంగా ఏసీని ఉపయోగించి ఇంటిని కూల్ చేయాలంటే ఎంతో విద్యుత్ అవసరం పడుతుంది. కానీ ఈ నీటి కుండల పద్దతితో ఏమాత్రం విద్యుత్ అవసరం లేకుండానే ఇంటిని చల్లబరుచుకోవచ్చు. రూ. వేలల్లో ఖర్చు చేసి ఏసీ కొనే అవసరం కూడా తప్పుతుంది. కొద్ది పాటి ఖర్చుతో కొన్ని కుండలను కొని.. ఇంటిపై వరుసగా ఏర్పాటు చేస్తే సరిపోతుంది.
Also Read: Free AC Scheme 2026: ప్రభుత్వం గుడ్ న్యూస్.. తీవ్రమైన ఎండల దృష్ట్యా.. ఉచితంగా ఏసీల పంపిణీ!
సాధారణంగా ఏసీల నుంచి వెలువడే వాయువులు పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని నిపుణులు అంటూ ఉంటారు. అయితే ఈ కుండల పద్దతిని ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లు కూడా అవుతుంది. పగలు ఎండ తీవ్రత పెరిగే కొద్దీ.. కుండల్లోని నీరు ఆవిరయ్యే ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని తద్వారా చాలా త్వరగా ఇంటికి చల్లదనం లభిస్తుందని వియత్నాం ప్రజలు అంటున్నారు. వియత్నాంలో ఇళ్లు ఒకదానికొకటి అత్తుకొని ఉండటం వల్ల గాలి ప్రసరణ కష్టంగా మారుతుందని.. దీనికి ఈ కుండల పద్దతి వరంగా మారిందని ప్రశంసిస్తున్నారు.
Also Read: దేశంలోనే బెస్ట్ పవర్ సేవింగ్ ఏసీలు.. ఇక రూ.500 లోపే కరెంటు బిల్లు.. వర్త్ వర్మా వర్త్!