చారిత్రాత్మక నాంపల్లి నుమాయిష్ అంటేనే ఒక ఉత్సవం, మధ్యతరగతి ప్రజల సరదా. కానీ ఈ ఏడాది నుమాయిష్ సందర్శకులకు చుక్కలు చూపిస్తోంది. లోపలికి అడుగు పెట్టిన దగ్గరి నుండి బయటకు వచ్చే వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతోంది. తినే తిండి దగ్గరి నుండి కొనే బట్టల వరకు అన్నీ ప్రీమియం రేట్లలో అమ్ముతుండటంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఎగ్జిబిషన్ అంటే రకరకాల వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయని ఆశించి వచ్చే సందర్శకులకు ఈసారి నిరాశే ఎదురవుతోంది. బయట మార్కెట్తో పోల్చుకుంటే ఇక్కడ ధరలు రెట్టింపు ఉన్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. సాధారణ గృహోపకరణాలు లేదా దుస్తులు ఏది కొనాలన్నా కనీసం వెయ్యి రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ‘బయట దొరికే వస్తువులకే ఇక్కడ బ్రాండెడ్ రేట్లు వసూలు చేస్తున్నారు’ అని ఒక సందర్శకుడు తన ఆవేదన వ్యక్తం చేశారు.
నుమాయిష్కి వెళ్లే వారు అక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈసారి తిండి పదార్థాల ధరలు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. బయట సుమారు 30 నుండి 40 రూపాయలకు లభించే ఒక ప్లేట్ మిర్చి బజ్జీని ఇక్కడ ఏకంగా 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే బయట మూడు ప్లేట్లు కొనే డబ్బుతో ఇక్కడ కేవలం ఒక్క ప్లేట్ మాత్రమే వస్తోంది. మిర్చి బజ్జీయే కాదు, చాయ్ నుండి బిర్యానీ వరకు ప్రతి ఐటమ్ ధరలు సాధారణ స్థాయి కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉండటంతో ఏదైనా తినాలంటే సామాన్యుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ధరలలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. స్టాల్స్ అద్దెలు పెరగడం వల్లే ధరలు పెంచామని వ్యాపారులు చెబుతున్నప్పటికీ, అది సందర్శకుల జేబులకు చిల్లు పెడుతోంది. పిల్లలతో కలిసి ఎగ్జిబిషన్ చూసి రావాలంటే కనీసం 3000 నుండి 5000 రూపాయలు ఖర్చవుతోందని మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వినోదం కోసం వచ్చి, ధరల భారం మోస్తూ వెనుతిరగాల్సి వస్తోందని పబ్లిక్ వాపోతున్నారు.