Central Funds: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. బుధవారం తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సాయం కోరుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కేంద్ర మంత్రికి వినతి పత్రం రాశారు. ఎస్ఏఎస్సీఐ కింద రూ.5 వేల కోట్ల ప్రత్యేక సహాయం – విద్యా రంగ పెట్టుబడులకు ఎఫ్ ఆర్ బీఎం మినహాయింపు కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రాలకు 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల రూపంలో అందిస్తున్న సహకారానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ఇప్పటికే రూ.4,208 కోట్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమని వివరించారు. తెలంగాణ దేశంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రాలలో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, 2014 నుంచి 2023 మధ్య ప్రత్యేక ప్రయోజన సంస్థలు ద్వారా చేపట్టిన అప్పుల భారం, వాటి చెల్లింపుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
భారీ స్థాయిలో పెట్టుబడులు
అయినప్పటికీ విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తోందని తెలిపారు. ప్రత్యేకంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ’ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. జిల్లాల వారీగా కొత్త మెడికల్ కళాశాలలు, గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా మౌలిక వసతుల బలోపేతం వంటి కార్యక్రమాలు సామాజిక సమానత్వంతో కూడిన సుస్థిర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రికి వినతిపత్రం
అదేవిధంగా, విద్యా రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భారీ పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రికి మరో వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ రూపాంతరానికి మొత్తం రూ.30 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించిందని, ఇందులో రూ.21 వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ల నిర్మాణం, మరో రూ.9 వేల కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలు, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నట్లు వివరించారు.
కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఈ క్రమంలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో రూ.4,049.11 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్ట్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సహకారంతో రూ.4,903.44 కోట్ల వ్యయంతో తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ మిషన్ ప్రాజెక్టులకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను రాష్ట్ర ఎఫ్ ఆర్ బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
వికసిత భారత్ 2047
ఇవి సాధారణ ఖర్చులు కాకుండా, భవిష్యత్ తరాల మానవ వనరుల అభివృద్ధికి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యా సాధికారతకు దోహదపడే దీర్ఘకాలిక మూలధన పెట్టుబడులని పేర్కొన్నారు.“వికసిత భారత్–2047” లక్ష్య సాధనలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యా, మౌలిక వసతుల పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని, కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లభిస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.ఉప ముఖ్యమంత్రి వెంట ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ డా. గౌరవ ఉప్పల్ ఉన్నారు.
Also Read: శాంతిభద్రతలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. పోలీస్ బాసులకు దిశా నిర్దేశం!