Amrut 2.0 Works: జనగామ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ 2.0’ స్కీమ్లో భాగంగా, పట్టణంలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణ , సుందరీకరణ పనులకు వీరు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1 కోటి 32 లక్షల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో కుంటను అందంగా తీర్చిదిద్ది, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచేలా పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం కూడా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా అందాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈ వేదికపైనే పట్టాలను పంపిణీ చేశారు.
అయితే, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఈ ఎంపిక ఉండాలని, ఆయా వార్డు కౌన్సిలర్ల దృష్టికి తీసుకువెళ్తూ అర్హులకు మాత్రమే న్యాయం జరిగేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: వనస్థలిపురంలో దారుణం.. అక్కను వేధిస్తున్నాడని బావను కొట్టి చంపిన బావమరిది!