Collector Harichandana: హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 ను విడుదల చేసినట్లు, అర్హులైన అభ్యర్థులు రుణాలపై దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్షన్ ప్లాన్ లో బ్యాంకు అనుసంధానంతో ఆర్థిక సహాయం రూ. లక్ష విలువైన టూ వీలర్ పై 90 శాతం సబ్సిడీ, రూ. 3 లక్షల విలువైన త్రి వీలర్ వాహనాలపై 70 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలోని అన్ని మండలాలలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు, వయస్సు 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఆన్లైన్ లో ఈ నెల 17 నుండి 24 వరకు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని ఆమె సూచించారు. అభ్యర్థుల సంవత్సర ఆదాయం రూ. రెండు లక్షలు మించకుండా ఉండాలని, అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, దివ్యాంగులకు సదరమ్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరని కలెక్టర్ సూచించారు.
ఈ ద్విచక్ర వాహనాల కోసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గిగ్ కార్మికులకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు తెలిపారు. జోమాటో, స్విగ్గి, రాపిడో, ఉబేర్ వంటివి క్లెయిమ్ చేయటానికి సంబంధింత సర్టిఫికెట్ సమర్పించాలని కలెక్టర్ వివరించారు. ఈ పథకాల కింద మొత్తం 540 లబ్దిదారులకు, సుమారు రూ.4 కోట్ల 58 లక్షల రాయితీ కేటాయించడం జరిగిందని తెలిపారు. టూ వీలర్ కోసం 270 మంది లబ్దిదారులు, త్రీ వీలర్ కోసం 153 మంది లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.