Hyderabad CP Warning: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (V.C. Sajjanar) తనదైన శైలిలో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో జీరో టోలరెన్స్ (Zero Tolerance) విధానాన్ని పాటిస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మద్యం మత్తులో పట్టుబడ్డాక పోలీసులతో వాగ్వాదానికి దిగవద్దని సజ్జనార్ సూచించారు. “మా నాన్న ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా? మా అన్న పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ తెలుసా?” అంటూ మా ఆఫీసర్ల దగ్గర పలుకుబడి ప్రదర్శించి సమయం వృథా చేయవద్దని హెచ్చరించారు. “మేము మీ ప్రైవసీని గౌరవిస్తాం. దయచేసి మీ వాహనాన్ని పక్కన పెట్టి వెళ్ళండి. మీకు వాయిదా వచ్చిన రోజు నేరుగా కోర్టులోనే పరిచయం చేసుకుందాం.” అంటూ సజ్జనార్ సెటైరికల్గా వార్నింగ్ ఇచ్చారు.
డిసెంబర్ 25 నుంచే నగరంలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ (Enforcement Drives) ప్రారంభమయ్యాయి. గతంలో తాను చెప్పిన “మందు కొట్టినప్పుడు క్యాబ్ బుక్ చేసుకోండి.. లాయర్ ని కాదు” (Book a cab, not a lawyer) అనే నినాదాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఆనందం విషాదంగా మారకుండా బాధ్యతగా ఉండాలని కోరారు.
సజ్జనార్ ట్వీట్కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలను చాలామంది సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం చట్టం అందరికీ సమానంగా వర్తింపజేయాలని కోరుతున్నారు. “రూల్స్ కేవలం సామాన్యులకేనా? బడా బాబులు, రాజకీయ నాయకుల పిల్లలు దొరికినప్పుడు కూడా పోలీసులు ఇదే తెగువ చూపిస్తారా?” అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అందరితోనూ మర్యాదగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: Sangareddy District: హెటిరో ఫ్యాక్టరీ మూసివేయాల్సిందే.. దోమడుగులో విద్యార్ధుల భారీ ర్యాలీ