Sangareddy District: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామంలో కాలుష్యానికి వ్యతిరేక పోరాటం ఉధృతమైంది. స్థానిక హెటిరో డ్రగ్స్ పరిశ్రమ నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల తమ గ్రామం, ప్రాణధారమైన చెరువు కలుషితమవుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు, గ్రామస్తులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.
గత కొంతకాలంగా హెటిరో పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా రసాయన వ్యర్థాలను వదులుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలోని నల్లకుంట చెరువు ఈ వ్యర్థాల కారణంగా పూర్తిగా విషపూరితంగా మారింది. చెరువు నీరు సాధారణ రంగును కోల్పోయి, గాఢమైన ఎరుపు రంగులోకి మారడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ కలుషిత నీటి వల్ల భూగర్భ జలాలు పాడవ్వడమే కాకుండా, పశువులు ఆ నీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సమస్యపై కేవలం పెద్దలే కాకుండా, రేపటి పౌరులైన విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. ‘మా ఊరిని కాపాడండి – కాలుష్యాన్ని తరిమికొట్టండి’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని, కాలుష్య కాటుతో అనేక రకాల చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. గ్రామస్తులు సైతం విద్యార్థులకు అండగా నిలిచి, పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు.
ర్యాలీలో పాల్గొన్న వారు ప్రభుత్వం , కాలుష్య నియంత్రణ మండలి (PCB) కి పలు డిమాండ్లు వినిపించారు. నల్లకుంట చెరువును కలుషితం చేస్తున్న హెటిరో పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని.. నిబంధనలు పాటించకుండా ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఆ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని.. కలుషితమైన చెరువు నీటిని శుద్ధి చేసి గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని పలు డిమాండ్లు చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామాన్ని ఈ కాలుష్య కోరల నుండి రక్షించే వరకు పోరాటం ఆపబోమని దోమడుగు వాసులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: Sangareddy district: ర్యాష్ డ్రైవింగ్.. స్కూల్ విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం