Hyderabad MLC election: హైదరాబాద్ సిటీలో పాగా వేయాలని భావించిన బీజేపీ ఆశలకు గండి కొట్టింది ఎంఐఎం. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం విజయం సాధించింది. కేవలం క్రాస్ ఓటింగ్పై మాత్రమే నమ్మకాలు పెట్టుకుని బోర్లాపడ్డారు కమలనాధులు. ఎంఐఎంకు 63 ఓట్లు రాగా, బీజేపీకి 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎంఐఎం గెలుపు సునాయాశమైంది.
దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం విజయం సాధించింది. కాంగ్రెస్ మద్దతుతో ఆ సీటును గెలుచుకుంది పతంగి పార్టీ. ఈ ఎన్నిక ముందు పెద్ద హైడ్రామా నెలకొంది. ఎన్నికల బరి నుంచి కారు పార్టీ తప్పుకుంది. దీంతో బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టింది. ఎంఐఎంకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. దీంతో ఎంఐఎం-బీజేపీ మధ్య పోటీ ఉత్కంఠగా మారింది.
బీజేపీకి హ్యాండ్ ఇచ్చిన బీఆర్ఎస్
మొత్తం 112 ఓట్లకు 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్లో బీజేపీ , కాంగ్రెస్ , ఎంఐఎం సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఆ పార్టీ ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటింగ్కు దూరమయ్యారు. అప్పుడే బీజేపీ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఒకవేళ కారు పార్టీ కార్పొరేటర్లు ఓటింగ్లో పాల్గొంటే పోటీ మరోలా ఉండేది.
శుక్రవారం ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్లో కౌంటింగ్ మొదలైంది. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్కి 63 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్రావు కేవలం 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్న బీజేపీ, అనూహ్యంగా పరాజయం పాలైంది.
ALSO READ: హైదరాబాద్ లో భాతర్ సమ్మిట్, 100 దేశాలకు పైగా ప్రతినిధులు హాజరు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మూడు సీట్లను గెలుచుకుని, అసలైన ప్రతిపక్షం తామేనని చెప్పే ప్రయత్నం చేసింది. బలం లేకుండా బరిలోకి దిగిన కమలనాధులు అప్పుడు విజయం సాధించడం తేలికైంది.
అదే ఊపు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కొనసాగించాలని ప్లాన్ చేశారు. సత్తా చాటి నగరంలో పాగా వేయాలని భావించింది. అందుకు ఆ పార్టీ రకరకాల ఎత్తులు వేసింది. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీకి హ్యాండ్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల్లో పాల్గొకపోయినా ఆ పార్టీ కార్పొరేటర్లు ఓటు వినియోగించుకుంటే బాగుండేదని అంటున్నారు. మొత్తానికి బీజేపీ ఆశలు అడియాశలయ్యాయి.
ఈ సీటు ఎన్నిక విషయంలో ఎంఐఎంకి మద్దతు ఇచ్చింది అధికార కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా గెలవడం ఆ పార్టీ వల్ల కాదని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్-ఎంఐఎం కూటమి విజయం అందుకుంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే జోరు కాంగ్రెస్ కూటమి కొనసాగిస్తుందన్న ప్రచారం అప్పుడే మొదలైపోయింది.