Hyderabad floods: హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసే భారీ వర్షాలు, రోడ్లు నదుల్లా మారడం, లోతట్టు ప్రాంతాలు ముంపులో మునగడం.. ఇవన్నీ ప్రతి మాన్సూన్ సీజన్లో పునరావృతమవుతున్నాయి. కానీ, ఇకపై నగరానికి ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ మిషన్ ప్రారంభించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రణాళికకు నాయకత్వం వహిస్తూ, ఇప్పటి పనులు ఈ తరం కోసం మాత్రమే కాదు, వచ్చే వందేళ్ల తరాల కోసం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు.
భారీ వర్షాల బీభత్సం.. నగరానికి ముందస్తు హెచ్చరిక
ఇటీవల హైదరాబాద్లో ఒకే రాత్రిలో 15 సెంటీమీటర్ల వర్షం పడింది. తక్కువ సమయంలో కురిసిన ఈ వర్షం రోడ్లను ముంచేసి, ట్రాఫిక్ను స్తంభింపజేసింది. లోతట్టు ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఈ పరిస్థితులు వాతావరణ మార్పుల వల్ల మరింత తీవ్రం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మూడు నెలల్లో పడే వర్షం ఇప్పుడు ఒకే రోజులో పడుతోంది. దీనిని తట్టుకునే శాశ్వత పరిష్కారం కోసం సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వ్యవస్థల పూర్తి ‘ప్రక్షాళన’ ఆదేశం
ప్రస్తుతం నగరంలోని రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా భరించలేవు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో తాగునీరు, వరదనీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వంటి అన్ని వ్యవస్థలను పూర్తిగా అప్డేట్ చేసి, వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్.. ప్రధాన ఆయుధం
హైదరాబాద్లో వరద సమస్యకు మూసీ పునరుజ్జీవనమే శాశ్వత పరిష్కారం అని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించనున్నారు. హుస్సేన్సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువు వంటి ప్రధాన జలాశయాలను నాలాల ద్వారా మూసీతో అనుసంధానం, నాలాల వెడల్పు ప్రక్రియ వేగవంతం చేయడం, కలుషిత నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపి, శుద్ధి చేసిన నీరు మాత్రమే మూసీకి చేరేలా సిస్టమ్ అమలు, ఈ చర్యలు పూర్తయితే నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపు సమస్య నుండి పూర్తిగా బయటపడతాయి.
Also Read: Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..
చెరువుల పునరుద్ధరణ – వరద నీటి నిల్వ భద్రత
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్తో పాటు నగరంలోని చెరువులు, కుంటలను కూడా పునరుద్ధరించనున్నారు. హుస్సేన్సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువుతో పాటు చిన్నచిన్న చెరువులు కూడా నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయబడతాయి. దీనివల్ల వర్షపు నీరు నేరుగా కాలనీల్లోకి చేరకుండా, చెరువుల ద్వారా నిల్వవుతుంది.
వందేళ్ల వరద రక్షణ వ్యూహం
ఎంత వర్షం పడినా, గ్రేటర్ హైదరాబాద్లో నీరు నిల్వ కాకూడదు, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకూడదని సిఎం అన్నారు. దీనికోసం ఆధునిక డ్రైనేజ్ నెట్వర్క్, చెరువుల అనుసంధానం, మూసీ పరిరక్షణ, మరియు సముద్ర మట్టానికి సరిపడే ఇంజనీరింగ్ సొల్యూషన్లు ఉపయోగించబడతాయి.
ట్రాఫిక్ సమస్యకు శాశ్వత చెక్
వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతోందని గుర్తించిన సీఎం, ముఖ్యంగా పాతనగరంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో పెడిస్ట్రియన్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్లతో పార్కింగ్ సమస్యకు పరిష్కారం, వర్షాకాలంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు.
ప్రజల భద్రత.. ప్రథమ ప్రాధాన్యం
వర్షాలు, వరదల సమయంలో నగరవాసుల ప్రాణాలు, ఆస్తులు సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం విపత్తు నిర్వహణ విభాగం, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, వాటర్ బోర్డు వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
మహానగరానికి కొత్త శకం
ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ ఇకపై భారీ వర్షాలు కురిసినా ముంపుకు గురి కాని నగరంగా మారుతుంది. ట్రాఫిక్, వరద నీటి సమస్యలు తగ్గి, పర్యావరణానికి హాని లేకుండా అభివృద్ధి జరగనుంది. ముఖ్యమంత్రి చెబుతున్నట్టే.. ఈ ప్రాజెక్ట్ మన పిల్లలకు, మన మనవళ్ళకు సురక్షితమైన హైదరాబాద్ను బహుమతిగా ఇస్తుందని చెప్పవచ్చు.