Bandi Sanjay: బీఆర్ఎస్ హయాంలో వావి వరుసలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విచారణంలో సిట్ అధికారులకు పలు ఆధారాలు అందిచినట్టు బండి సంజయ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ బీజేపీ చీఫ్ అయినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ అధికారులు వెల్లడించారని ఆయన చెప్పారు.
ఆ జాబితాలో రేవంత్, హరీష్ పేర్లు కూడా ఉన్నాయి..
బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ నే ఎక్కువగా ట్యాప్ చేశారని బండి సంజయ్ అన్నారు. అధికారులు చూపించిన వివరాలు చూసి షాక్ కు గురైనట్టు తెలిపారు. ‘మావోయిస్టుల జాబితాలో మా పేర్లు చేర్చి ట్యాప్ చేశారు. ఆ జాబితాలో రేవంత్, హరీష్ రావు పేర్లు కూడా ఉన్నాయి. ట్యాపింగ్ జరుగుతోందని నేను అప్పట్లోనే చెప్పా. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా చుట్టూ నిఘా పెట్టారు. మా ఇంట్లో సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కూతురు, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్..?
కేసీఆర్ హయాంలో సామాన్యులు కూడా ఫోన్లు మాట్లాడలేకపోయారు. కేసీఆర్ కూతురు, అల్లుడి ఫోన్లనూ ట్యాప్ చేశారు. వ్యాపారస్థఉల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. గతంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి వద్ద పట్టుకున్న రూ.7కోట్లు ఏమయ్యాయి.? టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ కేసు విచారణ చేస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ అయినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ అధికారులు నాకు చెప్పారు. ఎవరితో ఎంతసేపు మాట్లాడారన్న డేటాను సిట్ అధికారులు చూపించారు. మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో.. రాజకీయ నేతలతో మాట్లాడిన డేటాను సిట్ అధికారులు నాకు చూపించారు’ అని బండి సంజయ్ చెప్పారు.
కేసీఆర్ కుటుంబంలో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా..?
‘ఈ కేసును ఇంకా ఎంతకాలం సాగదీస్తారు.. ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబంలో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా..? ప్రభాకార్ రావు, కిషన్ రావులకు ఉరిశిక్ష విధించాలి. ట్యాపింగ్ కేసు నిందితులను రేవంత్ సర్కార్ కాపాడే ప్రయత్నం చేస్తోంది. వ్యాపారస్థుల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో దొరికిన డబ్బంతా కేసీఆర్ ఖాతాల్లోకి వెళ్లాయి.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయబోమని ప్రకటించారు. కేసీఆర్ ఏం చెబితే రేవంత్ అదే మాట్లాడతారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయబోమని చెప్పడానికి రేవంత్ ఎవరు..? ఆ విషయం చెప్పాల్సి వస్తే విచారణ అధికారులు చెప్పాలి’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
ALSO READ: Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?
ALSO READ: Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్కు అర్థం ఏంటి ?