H-City Project: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో పెరుగుతున్న ట్రా’ఫికర్’ కు త్వరలోనే చెక్ పడనుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ లోని పలు ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్యకు రానున్న 30 ఏళ్లను దృష్టి లో పెట్టుకుని పరిష్కారం సమకూరనుంది. సిటీలో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తేవటంతో పాటు రాకపోకలు మరింత వేగంగా సాగేందుకు వీలుగా ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులు ఎట్టకేలకు ఊపందుకున్నాయి. వాస్తవానికి స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (ఎస్ఆర్ డీపీ)-1, ఆ తర్వాత రూపొందించిన (ఎస్ఆర్ డీపీ)-2 ప్రతిపాదనలకు గత గులాబీ సర్కారు హయాంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైనా, ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగి పనులు పట్టాలెక్కాయి. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు చుట్టూ సుమారు రూ. 1090 కోట్ల వ్యయాంతో నిర్మించనున్న ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ లు పనులు కూడా ఊపందుకున్నాయి.
ఒక వైపు పనులను వేగవంతం చేస్తూ, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కల్గకుండా పనులను మరింత వేగవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ సమష్టిగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు ఐటీ కారిడార్ లోని త్రిబుల్ ఐటీ సమీపంలో రూ. 495 కోట్లతో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ రెండు ఫ్లై ఓవర్లు, మరో రెండు అండర్ పాస్ లకు కూడా అడ్డంకులన్నీ తొలగించి పనులు ఊపందుకున్నాయి. ఈ జంక్షన్ లో గచ్చిబౌలీ నుంచి బీహెచ్ఈఎల్ వైపు, తిరిగి బీహెచ్ఈఎల్ నుంచి గచ్చిబౌలీ వైపు రాకపోకలు సాగేందుకు వీలుగా రెండు ఫ్లై ఓవర్లను నిర్మించే పనులు వేగంగా జరగుతున్నాయి. ఫ్లై ఓవర్ల పిల్లర్ల కోసం గుంతలను తవ్వి సిద్దం చేశారు. మరో పక్షం రోజుల్లో పిల్లర్ల నిర్మాణం కీలక దశకు చేరనున్నట్లు తెలిసింది. ఇదే ప్రాజెక్టులో భాగంగా కొన్ని పిల్లర్లను సుమారు పది అడుగుల ఎత్తు వరకు నిర్మించారు. ఇదే జంక్షన్ లో మరో రెండు అండర్ పాస్ లను ఏర్పాటు చేసే పనులు కూడా మొదలయ్యాయి. త్రిబుల్ ఐటీ నుంచి డీఎల్ఎఫ్ వైపు ఓ అండర్ పాస్ ను ఏర్పాటు చేస్తుండగా, త్రిబుల్ ఐటీ నుంచి ఐఎస్ బీ వైపు మరో అండర్ పాస్ ను నిర్మిస్తున్నారు. త్రిబుల్ ఐటీ వద్ద రెండు ఫ్లై ఓవర్లు, మరో రెండు అండర్ పాస్ లు అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారమై రాకపోకలు వేగవంతం కానున్నాయి.
Also Read: Ward Administration: గద్వాల్లో రోజురోజుకు పెరుగుతున్న కబ్జాల పర్వం
హెచ్ సిటీ పనుల్లో భాగంగా కూకట్ పల్లి వై జంక్షన్ లో మూడు ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం స్థల సేకరణ దశలో ఉన్నట్లు తెలిసింది. మెట్రో కారిడార్ ఇప్పటికే ఉన్నందున ఆ కారిడార్ ను, అమీర్ పేట నుంచి వై జంక్షన్ వరకు రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టి లో పెట్టుకుని ఈ మూడు ఫ్లై ఓవర్లను డిజైనింగ్ చేసినట్లు సమాచారం. ఇందుకు గాను దాదాపు 9627 చదరపు గజాల స్థలాన్ని సేకరించేందుకు అధికారులు సిద్దమయ్యారు. వీలైనంత త్వరగా స్థల సేకరణ ప్రక్రియను పూర్తి చేసి, జంక్షన్ లో పనులను మొదలు పెట్టేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుంది. స్థలాలిచ్చే యజమానులకు టీడీఆర్ కాకుండా నేరుగా నష్టపరిహారం చెల్లిస్తే స్థల సేకరణ ప్రక్రియ త్వరగా ముగుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మూడు ఫ్లై ఓవర్లు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే అమీర్ పేట నుంచి మొదలుకుని మియాపూర్ వరకు రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. ఈ జంక్షన్ నుంచి అటు మియాపూర్, అటు అమీర్ పేట వైపు అత్యధికంగా ట్రాఫిక్ సమస్య నెలకొనటంతో ఈ రూట్ లో నిర్మించనున్న రెండు ఫ్లై ఓవర్లలో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా ర్యాంప్ లను కూడా నిర్మించేలా ఈ ఫ్లై ఓవర్లను డిజైనింగ్ చేసినట్లు సమాచారం.
జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్.వి. కర్ణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారిగా ఆయన కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ పనుల స్థల సేకరణ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా స్థల సేకరణ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ అడ్డంకులను అడిగి తెల్సుకుని, స్థలాలిచ్చే యజమానుల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జానా రెడ్డి నివాసానికి వెళ్లిన కమిషనర్ స్థల సేకరణ ప్రక్రియలో తమకు సహకరించాలని కోరిన సందర్భాలున్నాయి. దీంతో పాటు కమిషనర్ కర్ణన్ ప్రతి మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హెచ్ సిటీ పనులు, స్థల సేకరణపై వరుసగా నిర్వహించిన సమీక్షల కారణంగానే హెచ్ సిటీ పనులు ఊహించని స్థాయిలో వేగవంతమయ్యాయి. ఈ నెలాఖరుకల్లా హెచ్ సిటీ కి చెందిన 5 ప్యాకేజీల్లోని 23 ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసేలా కమిషనర్ అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.
Also Read: Maoist Son Letter: నాన్నా.. నిన్ను చూడాలని ఉంది అంటూ.. మావోయిస్టు కుమారుడి ఆడియో వైరల్..!