BRS Party: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ తప్పుకుంది. అసలు పోటీ చేయకుండానేఓటమిని అంగీకరించింది. రాజ్యసీటు కోసం ప్రయత్నం చేయలేదు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక ముందే చతికిలపడింది. పార్టీ తీరుపై నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎందుకు కనీసం ప్రయత్నం చేయలేదనేది ఇప్పుడు చర్చకుదారితీసింది.
రాష్ట్రంలో పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ ఓ వెలుగు వెలిగింది. ఏ ఎన్నికలు వచ్చినా గెలుపుమాదే అని ఆ పార్టీ నేతలు సైతం బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు అది రివర్స్ అయింది. ఏ ఎన్నికలు వచ్చినా తమకు ఓటమి తప్పదనే భావనకు వచ్చారు. అందుకే ముందస్తుగా ఓటమిని అంగీకరించి కనీసం పోటీకి సైతం అభ్యర్థులను నిలపడం లేదని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ప్రస్తుతం రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో సుస్పష్టమైంది. పార్టీ గుర్తుపై 37మంది ఎమ్మెల్యేలు గెలిచిన వారున్నారు. అసెంబ్లీ రికార్డుల్లోనూ ఈ లెక్క స్పష్టంగా ఉంది. ఒక అభ్యర్థి గెలువాలంటే 40మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. అయితే బీజేపీకి 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీకి 7గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి మద్దతు కోరితే ప్రస్తుతం ఉన్న రాజ్యసభ స్థానాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ కనీసం ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై నమ్మకం లేగనే రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని బరిలో నిలుపులేదనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. వారిని కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తే తమ పరిస్థితి ఏంటనేది అధిష్టానం ఆలోచన చేసి పోటీ కి దూరంగా ఉన్నట్లు సమాచారం. అభ్యర్థిని నిలిపి ఓడిపోయి.. కేడర్ లో మరింత నైరాశ్యం, ప్రజల్లోనూ పార్టీపై ఆశలు సన్నగిల్లుతాయనే ఉద్దేశంతోనే బరి నుంచి తప్పుకున్నట్లు స్పష్టమవుతుంది. అంతేకాదు ఓడిపోతే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలకు సైతం అస్త్రంగా మారుతుందని భావించి వారికి అవకాశం ఇవ్వొద్దని కేసీఆర్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.
Also Read: Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి యూ-టర్న్.. రేవంత్ పై పొగడ్తల వెనుక అసలు గుట్టు ఇదేనా!
బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ తో కలిసి పోతున్నారు. అయితే వారిపై బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు చేశారని వేటు వేయాలని స్పీకర్ తో పాటు కోర్టులను ఆశ్రయించింది. అయితే విచారణల పేరుతో కాలం దీస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు స్పీకర్ సైతం వాదనాలు విని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి క్లీన్ చిట్ ఇస్తున్నారు.. ఇప్పటికే 10 మందిలో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనని వారు పార్టీమారినట్లు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అదే విధంగా మిగిలిన 27 మందిలో కొంతమంది ఇప్పటికే పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో కొంత స్తబ్దత నెలకొంది.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు.. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తూ ఆ తర్వాత సైలెంట్ అవుతుందనే విమర్శలు పార్టీ నేతలే చేస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయకుండా కేవలం చిన్నచిన్న ఘటనలపై స్పందించడం, ఫిరాయింపు అంశంపై లీగల్ గా పైట్ చేయడం, ఎప్పుడో ఒకసారి ఏదో జిల్లానో.. ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి హల్ చల్ చేయడం.. ఆ తర్వాత సైలెంట్ కావడం పరిపాటిగా మారింది. దీంతో పార్టీ నేతలతో పాటు కేడర్ సైతం తీవ్ర నైరాశ్యానికి గురవుతున్నారు. మరోవైపు రాజ్యసభ అభ్యర్థిని బరిలో నిలుపుకపోవడం అంటే పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారనేది నమ్మకం లేదనేది స్పష్టమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Sukhoi Jet Crash: అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు