BRS Rally: 20 ఏండ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని రేవంత్ సర్కార్ దెబ్బతీస్తామంటే చూస్తూ ఊరుకోమని బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
“తెలంగాణ తల్లిని మార్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసివేశారు. తెలంగాణ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్లను రాచరిక పోకడలంటూ బద్నాం చేస్తున్నారు. మన తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక విలువలను దెబ్బతీసి.. తెలంగాణ అస్తిత్వ ద్రోహులుగా కాంగ్రెస్ నిలిచింది. నేడు మళ్లీ అదే తరహాలో.. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోంది” అని కేటీఆర్ విమర్శలు చేశారు.
కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకుపోయే ప్రయత్నం చేశారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మహానగరంలో గతంలో 24 సర్కిళ్లు ఉంటే 30 సర్కిళ్లు, 4 జోన్లు ఉంటే 6 జోన్లు చేశామన్నారు. ఇన్ని చేసినా కూడా హైదరాబాద్ అస్తిత్వాన్ని ఎప్పడు ముట్టుకోలేదన్నారు. అలాంటిది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ను శాశ్వతంగా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దానిని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పెద్దలందరూ కలిసి ఒక శాంతి ర్యాలీ చేస్తుంటే.. మమ్మల్ని వెళ్లనివ్వకుండా సీఎం ఆపుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
సికింద్రాబాద్ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి క్లాక్టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టేందుకు శ్రేణులు సిద్ధమయ్యారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. ఆల్ఫా హోటల్ లోకి వెళ్లి కార్యకర్తలను అరెస్టు చేశారు. బీఆర్ఎస్ శాంతి ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ప్యాటీ సెంటర్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
Also Read: అరెస్టులపై బీఆర్ఎస్ గగ్గోలు.. కాంగ్రెస్ అదిరిపోయే కౌంటర్!
ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత నిరసన ర్యాలీ చేపడుతుంటే వేలాది సంఖ్యలో పోలీసులను మోహరించి.. అరెస్టులు చేస్తున్నామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. శాంతి ర్యాలీని అడ్డుకుని కాంగ్రెస్ పైశాచిక ఆనందం పొందిండొచ్చని, కానీ మళ్లీ కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి తీరుతామన్నారు.