మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని అధికార కాంగ్రెస్ ముందే టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకు, ఆ పార్టీకి ఎదురైన ఓటములను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. 2023లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. అప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ పెద్దగా సత్తా చాటలేదు. దీనికి తోడు గత ప్రభుత్వంలో చేసిన అప్పులు, అవినీతిని సైతం ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ అధిష్టానం జిల్లా ఇన్చార్జి మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్కే పరిమితం అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఫార్ములా ఈ కారు రేసు కేసులో అరెస్టు భయంతో అ భద్రతా భావంలో ఉన్నట్టు తెలుస్తున్నది. మరోవైపు హరీశ్ రావు సైతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పేరు ప్రస్తావన రావడంతో ఆయన సైతం ఆందోళనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తున్నది.అయితే, సరిగ్గా ఎన్నికల సమయంలోనే కేసులను ముందుకు తీసుకువచ్చి పార్టీ కేడర్ను నిరాశ, నిస్తృహకు లోనయ్యేలా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలు చేస్తున్నదని మండిపడుతున్నారు.
గత సర్పంచ్ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పెద్దగా ఆదరణ లభించలేదు. మహిళలకు రూ.2500, పెన్షన్ పెంపు, తులం బంగారం, రైతు భరోసా, బీమా, ఉద్యోగాల భర్తీపై కేటీఆర్, హరీశ్ రావు భారీగా ప్రచారం చేసినా ప్రజల్లో ఆశించిన స్పందన రాలేదు. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా ఉంటుందని బీఆర్ఎస్ నేతలు ఆశించినా వారి ఆశలు అడియాశలయ్యాయి. ఈ క్రమంలోనే ఈసారి జిల్లాల రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ పార్టీకి మైలేజ్ తీసుకురావాలని కేటీఆర్,హరీశ్ రావులు భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. కానీ, అది ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
Meenakshi: మీనాక్షికి షాకింగ్ కండిషన్ పెట్టిన స్టార్ హీరో.. ఎవరు? ఎందుకో తెలిస్తే షాక్!
మాజీ సీఎం కేసీఆర్ బయటకు రాకపోవడంతో గులాబీ కేడర్ నిరాశలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. గతనెలలో ఆయన బయటకు వచ్చారు. తెలంగాణ భవన్లో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు బయటకు రాలేదు. 15 రోజుల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని ప్రభుత్వంపై ప్రజాఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇప్పటికే నెల రోజులు గడిచినా ఇంతవరకు సభల నిర్వహణ మీద మరల కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ పార్టీ గానీ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కేడర్ మరింత నిరాశకు లోనై నట్టు తెలుస్తున్నది. సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ వారియర్స్లో ఉత్సాహం తగ్గినట్టు కనిపిస్తున్నది. అధికార పార్టీ నుంచి ఎటువంటి తప్పిదాలు జరగకపోవడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా దెబ్బకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ చతికిల పడినట్టు తెలుస్తున్నది. కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ బయటకు రాకపోతే ఇక పూర్తిగా అంబాసిడర్ కారు షెడ్డుకు పోయినట్టే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.