తెలంగాణలో నిన్న జరిగిన ముగ్గురు జర్నలిస్టుల అరెస్టుల మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సహా మిగతా వామపక్ష పార్టీలు సైతం పెదవి విరుస్తున్నాయి. ఇక అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతలు కూడా ఇలా చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇక జర్నలిస్టు సంఘాల విషయానికొస్తే జర్నలస్టుల అరెస్టు అక్రమమని ఖండిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన కరువైంది. అసలు ఎందుకు అరెస్టు చేశామనే కారణాన్ని మాత్రం పోలీసులు స్పష్టంగా ఎత్తిచూపుతున్నారు. విచారణకు పిలిచిప్పుడు రాకుండా ఫోన్స్ ఆఫ్ చేసి బ్యాంకాంక్ పారిపోదామన చూస్తే ఇలాగే పట్టుకొని రావాల్సి వస్తుందని నగర సీపీ సజ్జనార్ స్పష్టంచేశారు.
రాష్ట్రంలోని ఓ ప్రముఖ న్యూస్ టెలివిజన్ చానెల్లో ఓ మంత్రి, ఓ ఐఏఎస్ అధికారిణిపై తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అందులో వాస్తవం ఎంత ఉన్నదనే విషయం పక్కనబెడితే సోషల్ మీడియాలో సదరు మంత్రి, సదరు ఐఏఎస్ అధికారిణిపై పెద్దఎత్తున అసత్య ప్రచారం జరిగిందనే నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ విషయంలో సమగ్ర విచారణకు ఆదేశించింది. దీనికి హెడ్గా నగర సీపీ సజ్జనార్ ఉన్నారు.అయితే,ఈ వ్యవహారంలో ముందుగా ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకరిని వదిలేశారు. మరో ఇద్దరిని కోర్టులో హాజరు పరిచి విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే న్యూస్ చానెల్తో పాటు జర్నలిస్టును మెడ పట్టుకుని లాక్కెళ్లిన విషయం జోరుగా అన్ని ప్రసార మాద్యమాల్లో వైరల్ అయ్యింది.
జర్నలిస్టుల అరెస్టుపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ ప్రభుత్వంలో ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. మంత్రి మీద వచ్చిన ఆరోపణలో నిజం లేకపోతే ఖండిస్తే సరిపోతుందని, ఇలా అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని.. అది కూడా రాత్రిళ్లు జర్నలిస్టుల ఇండ్లకు వెళ్లి వారి కుటుంబాలను భ్రయభ్రాంతులకు గురిచేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.రాహుల్ మొహబ్బత్ కీ దుకాణ్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హక్కులను కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు.
CM Revanth: హైదరాబాద్కు ‘సదరన్ కమాండ్ సెంటర్’.. సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి.
జర్నలిస్టుల అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. వారి హయాంలో చేసిన దారుణాలు గుర్తుకు లేవా అని అధికార పార్టీ నేతలు, మంత్రులు గుర్తుచేస్తున్నారు. అసత్య కథనాలతో వ్యక్తుల స్వేచ్ఛను హరించడం జర్నలిజం ఎలా అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదురుదాడికి దిగారు.ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని.. ఆధారాలు లేకుండా కథనాలు రాసి రాక్షసానందం పొందుతామనుకుంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు.. తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద దాడి, జర్నలిస్టు రఘు అరెస్టు, ప్రశ్నించిన వారి మీద గులాబీ రౌడీలతో దాడులు మర్చిపోయారా? అంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం తమకు వ్యతిరేకంగా కథనాలు రాసారని మహా న్యూస్ మీద గులాబీ కేడర్ దాడులు మర్చిపోయారా? తామింకా అలా చేయడం లేదని, చట్టపరంగా ముందుకు వెళ్లామని చెబుతున్నారు.