Hyderabad Metro Pillar: ప్రయాణికుల ప్రాణాలను ముప్పు వాటిల్లేలా మెట్రో పిల్లర్ల చుట్టూ గుంతలు తవ్విన వ్యవహరాన్ని బిగ్ టీవీ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. సికింద్రాబాద్ లో ఇస్కాన్ టెంపుల్ చుట్టూ ఈ గుంతలు తవ్వగా.. వీటికి ఏ అధికారి అనుమతించారనే అంశంపై మా రిపోర్టర్లు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కు ఘటనాస్థలి నుంచి ఫోన్ చేయగా ఆయన ఆన్సర్ చేయలేదు. అటు మెట్రో అధికారులు, కాంట్రాక్టర్లకు సైతం ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.
మెట్రో పిల్లర్ల పటిష్టతను దెబ్బతీసేలా జరిపిన తవ్వకాలపై బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేస్తున్నప్పటికీ.. అధికారుల నుంచి స్పందన లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇల్లీగల్ కన్ స్ట్రక్షన్ ను అధికారులు దృష్టికి బిగ్ టీవీ తీసుకొచ్చినప్పటికీ.. ఇంతవరకూ ఎవరూ కూడా ఘటన స్థలికి రాకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అనధికారిక తవ్వకాల వెనుక అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా వారి వైఖరి ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే మెట్రో పిల్లర్ల చుట్టూ ఈ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నా అధికారులకు తెలియలేదా? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. పిల్లర్ల చుట్టూ ఏం చేస్తున్నారన్న విషయం చుట్టుపక్కల వారికి తెలియకుండా చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేయడం ఏంటన్న ప్రశ్న ఎదురవుతోంది. సాధారణంగా నగరంలో ఈ చిన్న విషయం జరిగినా తమ దృష్టికి వస్తుందని పదే పదే అధికారులు చెబుతుంటారు. అలాంటిది నగరం నడిబొడ్డున అది కూడా నిత్యం వేలాది మంది నగరవాసులు ప్రయాణించే మెట్రో పిల్లర్ల కింద ఈ స్థాయిలో తవ్వకాలు జరుగుతుంటే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వెళ్లలేదా? ఒకవేళ వెళ్లినా పట్టించుకోకుండా వదిలేశారా? అన్నది తెలియాల్సి ఉంది.
ఒకవేళ ప్రమాదం జరగకపోయినా.. కాస్త మెట్రో పిల్లర్ కూలినా మరమ్మత్తుల కోసం మళ్లీ కోట్లాది రూపాయలు ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ గుంతల వల్ల ఏ మాత్రం పిల్లర్లకు నష్టం వాటిల్లినా.. మెట్రో బ్లూ లైన్ క్యారిడార్ మెుత్తం రాకపోకలు నిలిచిపోయే పరిస్థితులు తలేత్తొచ్చు. అదే జరిగితే మెట్రో ప్రయాణాన్ని నమ్ముకొని ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్న నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి జీహెచ్ఎంసీ, మెట్రో అధికారులు ఇప్పటికైనా ఘటనాస్థలికి వచ్చి.. దీనిపై వివరణ ఇవ్వాలని బిగ్ టీవీ గట్టిగా డిమాండ్ చేస్తోంది.
Also Read: రాయిలా నటిస్తూ.. ప్రపంచాన్నే బురిడి కొట్టిస్తున్న అరుదైన మెుక్క.. ఏమన్నా తెలివా?
అయితే పిల్లర్ల చుట్టూ గుంతలు తవ్వడం వల్ల ఏం జరుగుతుందన్న ప్రశ్న చాలా మందికి కలగొచ్చు. ఆ పిల్లర్లు దగ్గర మట్టిన తొలగించడం వల్ల పునాది వీక్ అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు పడినప్పుడు అక్కడి మట్టి బలహీనపడి భూమిలోకి కూరుకుపోవచ్చని పేర్కొంటున్నారు. అదే జరిగితే దాని కారణంగా పిల్లర్ సైతం కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా పిల్లర్పై ఆధారపడిన వంతెన కూడా కిందకి కుంగి.. ఆ సమయంలో వేగంగా మెట్రో రైలు పట్టాలు తప్పే అవకాశాలను కొట్టిపారేయలేమని పేర్కొంటున్నారు. ప్రమాదవశాత్తు మెట్రో పట్టాలు తప్పి పైనుంచి కిందకి పడిపోతే జరిగే ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేమంటున్నారు.
Also Read: కేసీఆర్ భూములపై రచ్చ.. ఆనాడే భూస్వాములు, డీల్ చేయలేకపోతున్నారన్న కేటీఆర్