Praja Palana: మరోవైపు రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా, భూమి–భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం ఉద్ధృతమైందని రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డి, అనభేరి ప్రభాకర్రావు, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో యోధులు ఈ పోరాటాలకు నాయకత్వం వహించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాలు, పోరాటాల నేపథ్యంలో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఆపరేషన్ పోలో సైనిక చర్య చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఆపరేషన్ పోలో అనంతరం ఏడో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం అధికారికంగా భారతదేశంలో అంతర్భాగమైందన్నారు. అది నిజాం పాలకుల అధికారం ముగిసిన రోజు మాత్రమే కాదు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భం అని సీఎం కొనియాడారు. దుకే సెప్టెంబర్ 17ను మనం “ప్రజా పాలన దినోత్సవం”గా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం వారి సమస్యలకు పరిష్కారం చూపడం..వారి హక్కులను కాపాడడం ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడడం. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితి కల్పించడం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమయ్యే వరకు ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు జరిగాయి. ఆ చరిత్ర మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోందన్నారు. పాలనలో ప్రజలే కేంద్రంగా ఉండాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రామాణికం కావాలన్నారు. అదే స్ఫూర్తితో ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజా పాలన కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతో మాత్రమే కాదు.. ప్రపంచంతో పోటీ పడుతోందని రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరింది. ఇది దేశ తలసరి ఆదాయం కన్నా దాదాపు 91 శాతం అధికం అని సీఎం రేవంత్ తెలిపారు. అభివృద్ధి అంకెల్లో మాత్రమే కాకుండా.. ప్రజల జీవితాల్లో కనిపించాలన్నదే మా లక్ష్యమని అన్నారు.
Also read: సీఎం వస్తేనే అసెంబ్లీకి వస్తారా.. అధికార మంత్రుల తీరుపై సొంత నేతలు ఫైర్!
ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి. ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశాం. రూ.20,616 కోట్లు విడుదల చేసి 25.35 లక్షల రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయటపడేశామని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించామని, ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. 32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి దాదాపు రూ.1 లక్ష 72 వేల కోట్లు ఖర్చు చేశామని, రైతుకు భూమితోనే భుక్తి అందుకే భూ భారతి చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. భూధార్, ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు ప్రారంభించామని, 5 లక్షల 94 వేల మంది రైతులకు పట్టాదార్ పాస్బుక్స్ జారీ చేశామన్నారు.
గౌరవ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేపట్టమని, ఫిబ్రవరి 4ను ప్రతి ఏటా “తెలంగాణ సోషల్ జస్టిస్ డే”గా జరుపుకుంటున్నామన్నారు. సామాజిక న్యాయం అంటే మాకు నినాదం కాదు. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడం అని, అవకాశాలు తక్కువగా దక్కిన వారికి మరిన్ని అవకాశాలు కల్పించడం అని సీఎం తెలిపారు. అప్పుడే సమాజం సమానంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజా ప్రభుత్వానికి విద్య, వైద్యం రెండు కళ్లలాంటివి. కుల, మత భేదాలు లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో సకల వసతులతో వీటి నిర్మాణం చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక ఘట్టం. సకల జనుల ఉద్యమం, ఎన్నో పోరాటాలు, అమరుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు ఆ చరిత్ర ఆ ఉద్యమాల ఫలాలు ప్రజల జీవితాల్లో కనిపించాలని సీఎం తెలిపారు. రైతుకు భరోసా ఉండాలి. మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి. పేద బిడ్డకు మంచి చదువు, మంచి వైద్యం అందాలని, యువతకు ప్రపంచంతో పోటీ పడే అవకాశాలు రావాలన్నారు. అభివృద్ధి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ చేరాలి. చరిత్రను మరిచిపోం చరిత్ర దగ్గరే ఆగిపోం ఆ పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను ప్రపంచం గర్వించే రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also read: ‘కాకా’ చిత్రంలో అలనాటి హీరోయిన్ స్నేహ.. నిజమెంత?