Hyderabad Metro Rail: హైదరాబాద్ వాసులకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో సేవలను పొడిగించారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న మెట్రో టైమింగ్స్లో మార్పులు చేశారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మెట్రో అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా నగరంలో పలు ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు చేస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
సాధారణ రోజుల్లో మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 31న మాత్రం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు మెట్రోను ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో గమ్యస్థానాలకు వెళ్లేందుకు మెట్రో బెటర్ ఆప్షన్ అని తెలిపారు.
హైదరాబాద్ లో డిసెంబర్ 31న రాత్రి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. సొంత వాహనంలో ఎక్కడికైనా వెళ్లేందుకు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇబ్బందులు తప్పవు. కొత్త ఏడాది సందర్భంగా మెట్రో రైళ్లు, స్టేషన్లలో పోలీసులు, మెట్రో సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టనున్నారు. దీంతో ప్రయాణికులు బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని మెట్రో అధికారులు కోరారు.